Sunday, April 24, 2011

నమ్మకమే దేవుడైతే...

ఎవ్వర్నో సమర్దించాలి అనో అక్షేపించాలి అనో నా ఉద్దేశం కాదు. ఈ ఇరవై రోజుల పైచిలుకు నడిచిన చరిత్ర పై నా అంతరంగం మాత్రమే. చిన్నప్పటి నుంచి, నాకు సత్య సాయి భక్తులతో పరిచయం ఉండేది. మా ఇంట్లో ఒక పోర్షన్ లో తెలుగు మాస్టారు ఒకాయన అద్దెకుండే వాళ్ళు. దంపతులిద్దరూ సాయి భక్తులే. ప్రతి గురు వారం అనుకుంటాను సాయి భజనలు జరిగేవి. మా నాన్న పక్కా సామ్యవాది. ఆయన గుడికి వెళ్ళడం కూడా నేను చూడగా జరగలేదు. మాస్టారికి మా నాన్న గారికి సాయి కారణం గా వాదోపవాదాలు జరిగేవి. మనిషి దేవుడేంటి అని మా నాన్న వాదిస్తే, మీరు సాయి ని గురించి తెలుసుకొని మాట్లాడండి అని ఆయన అనేవాళ్ళు. వాళ్ళ భజనలకు,పూజలకు మాకు ఆహ్వానం అందేది.సామాన్యం గా వెళ్ళేవాళ్ళం కాదు కాని, ఒక్కసారి మాత్రం భజనకు వెళ్లినట్టు గుర్తు.
తర్వాత్తర్వాత, నాకు అదే భావం ఏర్పడింది.నా మటుకు నేను నయా జమానా బాబాలను, అమ్మలను, బాబాయిలను( అమ్మ భగవాన్ ఉండగా బాబాయి భగవాన్ ఎందుకు ఉండరాదు ? ) నమ్మక పోయినా, మనిషి దేవుడా..అన్న మీమాంస పక్కన పెడితే,లక్షలాది ప్రజల నమ్మకమే దేవుడని నేను నమ్ముతాను.
దేవుడు, ఈ విశ్వాన్నే నడిపే మానవాతీత దివ్య శక్తీ అన్న భావనలు, స్త్రుస్టి మొదలైన కాలం నాటివి. వీటికి కొంతమంది హేతు వాదులు తప్ప, ఎవ్వరు అతీతులు కాదు.మతం అనేది ఒక భావన, ఒక విశ్వాసం, ఒక జీవన విధానం.హిందూ మతం సర్వ జనీనం. అది ఒక మహా నది.ఎన్నో భావనలు,నమ్మకాలు,విస్వాసాలనే, చిన్న చిన్న పిల్ల కాలువలు, ఉప నదులు ఇందులో భాగాలు.ఈ మహా నది పయనించే మార్గం, చూపే దారి ఆ పరమాత్మను చేరడానికే.
ఇందులో వాదోపవాదాలకు స్తానం లేదు. సంఘానికి చెరుపు చేసే వరకు ( ఓం శిన్రి క్యో లాంటి సంస్తలు) మనం వీటిని ఆక్షేపించాలేము.ఎవరి నమ్మకం వారిది. ఎవరి విశ్వాసాలు వారివి. మిగతా బాబాలు బేబీ లతో పోల్చితే సత్య సాయి చేపట్టిన సేవ మార్గం అనితర సాద్యం. అయిదు లక్షల పైచిలుకు సామాన్య జనానికి ఆయన స్తాపించిన ఆసుపత్రుల్లో స్వాంతన లభించింది. ఎన్నో లక్షల విద్యార్ధులు ఆయన విద్య సంస్తాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. అనంతపురం లాంటి కరువు జిల్లాలు ఆయన సేవామార్గం లో గుక్కెడు నీళ్ళకు నోచుకున్నాయి. అంతెందుకు, తమిళ ప్రభుత్వం చెన్నై వాసుల దాహార్తి తీర్చినందుకు సత్య సాయి కి కృతఙ్ఞతలు తెల్పుతుంది.
ప్రపంచ వ్యాప్తం గా ౧౩౩ దేశాల్లో సాయి సంస్తలు జన సేవ చేస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నాయి. అవన్నీ చూసాక నా అంతట నాకు ఆయన దేవుడైతే నేమి కాకుంటే నేమి, ఆయన కారణం గా జరిగిన జనోద్దరణ లోనే నాకు దేవుడు కనపడుతున్నాడు.
ఇక నమ్మకాలు. దేవుడిని ఎవరైనా చూసారా? ఏ గుడిలోనో, మసీదు లోనో, చర్చిలోనో, గురు ద్వారా లోనో ఆయన కనపడ్డాడా...మనిషి నమ్మకమే దేవుని ఉనికికి పునాది. అలా అని నేను హేతు వాడిని కాదు..అలాగని దేవుడిని అని చెప్పుకునే ప్రతి మనిషి దేవుడూ కాలేడు. దేవుడంటే మహిమలు చూపాలి, దేవుడంటే మనిషికి సాద్యం కాని కార్యాలు చెయ్యాలనే మనుషుల పురాతన భావనలు నమ్మకాలే, నేటి బాబాలు గాలి లోంచి వివిధ వస్తువులు గారడీ తో సృష్టించడం,శివరాత్రి రోజు ఆత్మ లింగాలంటూ నోట్లోంచి తియ్యడం లాంటి పనులకు పూరి గొల్పుతున్నాయి అంటాను. అలచేయ్యక పొతే జనం పుసుక్కునా ఆ మాత్రం చెయ్య లేని వాడివి నువ్వేం దేవుడివి అంటారేమో అని, ప్రతి నయా బాబా లటక్కన శివలింగాలు తియ్యడం, విబూతి ఉంగరాలు ,రొలెక్ష్ వాచీలు గాలి లోంచి తియ్యడం ఫాషన్ ఆయి పోయింది.వీటన్నిటి సత్య సాయి ఆద్యుడని,గొర్రె జనం ఇలాంటివి నమ్మేంత వరకు ఇవి మన భారత భూమి లో నిత్య సత్యాలు అవుతాయి అని మాత్రం ఖండితం గా చెప్పగలను.
జీవన గమనం లో ప్రతి మనిషి కి ఒక మార్గ దర్శి కావాలి. భాదలు కష్టాలు పంచుకుని, ధైర్యం చెప్పే గురువు కావాలి. కనీసావసరాలకే జనం మొహం వాచే మన లాంటి దేశాల్లో, నిత్యం బ్రతుకు ఒక పోరాటం అయిన కాలం లో ప్రతి మనిషి ఎవర్నో ఒక అదృశ్య శక్తీ ఆసరా కావాలను కోవటం సామాన్య విషయం. ఆ నమ్మకమే మనలను ముందుకు నడుపుతుంది.పైనుంచి మన బ్రతుకు దిద్దే మహా శక్తి అండ మనకుందనే నిర్దిష్ట భావనలే కొండంత అండ నిస్తాయి.కాని, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఈ బలహీనతలను సొమ్ము చేసుకునే మహాను భావులు దేశమంతా బయలు దేరారు.పేర్లెందుకు గాని, ప్రతి సందు గొందులో ఇలాటి బాబాలు అమ్మలు వెతకకనే మీకు తారస పడతారు..నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు...మీ బలహీనతలను అమ్ముకునేందుకు..వీరు యెంతో కొంత సమాజ సేవ చేస్తున్న సత్తే కాలపు బాబాలు కారు... ఇకనైనా కళ్ళు తెరవండి...తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త...

No comments:

Post a Comment