Sunday, April 24, 2011

నమ్మకమే దేవుడైతే...

ఎవ్వర్నో సమర్దించాలి అనో అక్షేపించాలి అనో నా ఉద్దేశం కాదు. ఈ ఇరవై రోజుల పైచిలుకు నడిచిన చరిత్ర పై నా అంతరంగం మాత్రమే. చిన్నప్పటి నుంచి, నాకు సత్య సాయి భక్తులతో పరిచయం ఉండేది. మా ఇంట్లో ఒక పోర్షన్ లో తెలుగు మాస్టారు ఒకాయన అద్దెకుండే వాళ్ళు. దంపతులిద్దరూ సాయి భక్తులే. ప్రతి గురు వారం అనుకుంటాను సాయి భజనలు జరిగేవి. మా నాన్న పక్కా సామ్యవాది. ఆయన గుడికి వెళ్ళడం కూడా నేను చూడగా జరగలేదు. మాస్టారికి మా నాన్న గారికి సాయి కారణం గా వాదోపవాదాలు జరిగేవి. మనిషి దేవుడేంటి అని మా నాన్న వాదిస్తే, మీరు సాయి ని గురించి తెలుసుకొని మాట్లాడండి అని ఆయన అనేవాళ్ళు. వాళ్ళ భజనలకు,పూజలకు మాకు ఆహ్వానం అందేది.సామాన్యం గా వెళ్ళేవాళ్ళం కాదు కాని, ఒక్కసారి మాత్రం భజనకు వెళ్లినట్టు గుర్తు.
తర్వాత్తర్వాత, నాకు అదే భావం ఏర్పడింది.నా మటుకు నేను నయా జమానా బాబాలను, అమ్మలను, బాబాయిలను( అమ్మ భగవాన్ ఉండగా బాబాయి భగవాన్ ఎందుకు ఉండరాదు ? ) నమ్మక పోయినా, మనిషి దేవుడా..అన్న మీమాంస పక్కన పెడితే,లక్షలాది ప్రజల నమ్మకమే దేవుడని నేను నమ్ముతాను.
దేవుడు, ఈ విశ్వాన్నే నడిపే మానవాతీత దివ్య శక్తీ అన్న భావనలు, స్త్రుస్టి మొదలైన కాలం నాటివి. వీటికి కొంతమంది హేతు వాదులు తప్ప, ఎవ్వరు అతీతులు కాదు.మతం అనేది ఒక భావన, ఒక విశ్వాసం, ఒక జీవన విధానం.హిందూ మతం సర్వ జనీనం. అది ఒక మహా నది.ఎన్నో భావనలు,నమ్మకాలు,విస్వాసాలనే, చిన్న చిన్న పిల్ల కాలువలు, ఉప నదులు ఇందులో భాగాలు.ఈ మహా నది పయనించే మార్గం, చూపే దారి ఆ పరమాత్మను చేరడానికే.
ఇందులో వాదోపవాదాలకు స్తానం లేదు. సంఘానికి చెరుపు చేసే వరకు ( ఓం శిన్రి క్యో లాంటి సంస్తలు) మనం వీటిని ఆక్షేపించాలేము.ఎవరి నమ్మకం వారిది. ఎవరి విశ్వాసాలు వారివి. మిగతా బాబాలు బేబీ లతో పోల్చితే సత్య సాయి చేపట్టిన సేవ మార్గం అనితర సాద్యం. అయిదు లక్షల పైచిలుకు సామాన్య జనానికి ఆయన స్తాపించిన ఆసుపత్రుల్లో స్వాంతన లభించింది. ఎన్నో లక్షల విద్యార్ధులు ఆయన విద్య సంస్తాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. అనంతపురం లాంటి కరువు జిల్లాలు ఆయన సేవామార్గం లో గుక్కెడు నీళ్ళకు నోచుకున్నాయి. అంతెందుకు, తమిళ ప్రభుత్వం చెన్నై వాసుల దాహార్తి తీర్చినందుకు సత్య సాయి కి కృతఙ్ఞతలు తెల్పుతుంది.
ప్రపంచ వ్యాప్తం గా ౧౩౩ దేశాల్లో సాయి సంస్తలు జన సేవ చేస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నాయి. అవన్నీ చూసాక నా అంతట నాకు ఆయన దేవుడైతే నేమి కాకుంటే నేమి, ఆయన కారణం గా జరిగిన జనోద్దరణ లోనే నాకు దేవుడు కనపడుతున్నాడు.
ఇక నమ్మకాలు. దేవుడిని ఎవరైనా చూసారా? ఏ గుడిలోనో, మసీదు లోనో, చర్చిలోనో, గురు ద్వారా లోనో ఆయన కనపడ్డాడా...మనిషి నమ్మకమే దేవుని ఉనికికి పునాది. అలా అని నేను హేతు వాడిని కాదు..అలాగని దేవుడిని అని చెప్పుకునే ప్రతి మనిషి దేవుడూ కాలేడు. దేవుడంటే మహిమలు చూపాలి, దేవుడంటే మనిషికి సాద్యం కాని కార్యాలు చెయ్యాలనే మనుషుల పురాతన భావనలు నమ్మకాలే, నేటి బాబాలు గాలి లోంచి వివిధ వస్తువులు గారడీ తో సృష్టించడం,శివరాత్రి రోజు ఆత్మ లింగాలంటూ నోట్లోంచి తియ్యడం లాంటి పనులకు పూరి గొల్పుతున్నాయి అంటాను. అలచేయ్యక పొతే జనం పుసుక్కునా ఆ మాత్రం చెయ్య లేని వాడివి నువ్వేం దేవుడివి అంటారేమో అని, ప్రతి నయా బాబా లటక్కన శివలింగాలు తియ్యడం, విబూతి ఉంగరాలు ,రొలెక్ష్ వాచీలు గాలి లోంచి తియ్యడం ఫాషన్ ఆయి పోయింది.వీటన్నిటి సత్య సాయి ఆద్యుడని,గొర్రె జనం ఇలాంటివి నమ్మేంత వరకు ఇవి మన భారత భూమి లో నిత్య సత్యాలు అవుతాయి అని మాత్రం ఖండితం గా చెప్పగలను.
జీవన గమనం లో ప్రతి మనిషి కి ఒక మార్గ దర్శి కావాలి. భాదలు కష్టాలు పంచుకుని, ధైర్యం చెప్పే గురువు కావాలి. కనీసావసరాలకే జనం మొహం వాచే మన లాంటి దేశాల్లో, నిత్యం బ్రతుకు ఒక పోరాటం అయిన కాలం లో ప్రతి మనిషి ఎవర్నో ఒక అదృశ్య శక్తీ ఆసరా కావాలను కోవటం సామాన్య విషయం. ఆ నమ్మకమే మనలను ముందుకు నడుపుతుంది.పైనుంచి మన బ్రతుకు దిద్దే మహా శక్తి అండ మనకుందనే నిర్దిష్ట భావనలే కొండంత అండ నిస్తాయి.కాని, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఈ బలహీనతలను సొమ్ము చేసుకునే మహాను భావులు దేశమంతా బయలు దేరారు.పేర్లెందుకు గాని, ప్రతి సందు గొందులో ఇలాటి బాబాలు అమ్మలు వెతకకనే మీకు తారస పడతారు..నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు...మీ బలహీనతలను అమ్ముకునేందుకు..వీరు యెంతో కొంత సమాజ సేవ చేస్తున్న సత్తే కాలపు బాబాలు కారు... ఇకనైనా కళ్ళు తెరవండి...తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త...

Friday, April 8, 2011

జై అన్నా..జై హింద్...

ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. కాని, మున్ముందు ఈ సంకల్పానికి ఎన్ని ఆటంకాలు కల్పిస్తారో, అన్నాతో మనం వాటిని ఎలా ఎదిరిస్తామో అనేది శేష ప్రశ్న...

Thursday, April 7, 2011

జన లోక్పాల్ బిల్ కోసం ఆందోళన ----౩ వ రోజు

౧. సోనియా గాంధీ , హజారే ఆందోళన కు మద్దత్తు తెలిపారు. (తప్పని పరిస్తుతుల్లో)
౨.ప్రభుత్వం , లోక్ పాల్ బిల్ తిరిగి రాయడానికి, సగం మంది పార్లమెంట్ సభ్యులతో సగం మంది మేధావులతో ( ఇద్దర్లో చాల తేడ ఉంది కాబట్టి) కమిటి నెలకొల్పడానికి అంగీకరించింది.కాని దాన్ని ఎవరు నాయకత్వం వహించాలి అనేది ఇంకా తేల లేదు. ఇంకా, కమిటి ఎప్పుడు నుంచి పని చెయ్యడం ప్రారంభిస్తుందో చెప్పలేదు.
౩.బుదవారం మంత్రి వర్గ మీటింగ్ లో ఈ ఆందోళన యెంత త్వరగా ముగిస్తే అంత మంచిదని, మంత్రులు అభిప్రాయపడ్డారు.(భయ పడ్డారు)
౪. సోషల్ నెట్వర్క్ లలో,మీడియా లో అన్నా ఆందోళనకు విశేష స్పందన కన్పించింది.
౫. పలు నగరాల్లో జనం ఆందోళన కు అనుకూలం గా ప్రదర్సనలు నిర్వహించారు...

ఇంకేదుకు ఆలీసం...మీరు అనండి...జై అన్నా...జై హింద్... :)

Wednesday, April 6, 2011

అన్నా..మీ వెనకే మేమంతా...

ఇది ఏ యువ భావి భారత ప్రధాని కధో కాదు. మహా కేక కుమారుడు యువ కేక దీ కాదు. పిల్లి మొగ్గలేసే మెగా స్టార్ లది, జనం గుండు గీసే యడ్డి లది కాదు.ఇంతెందుకు లోక సేవ పేరు చెప్పి, లోకాన్నే మింగేసే మగానుభావులేవరిదీ కాదు. ఒక నేలబారు భారతీయుడిది. ఇలాంటి పాత్రలు మీ ఇంటి పక్కనో, అదిగో ఆ వీధి చివర్లోనో మీకు తగలచ్చు. కాని, తేలిగ్గా తీస్కోకండే. ఇండియా బలమంతా, ఈ బక్కచిక్కినోల్ల దగ్గరే ఉంది. ఎలా గంటార..ఇదిగో ఇల్లగా.
ఆయన పుట్టింది ౧౯౪౦ లో, ఒక నిరుపేద కుటుంబం లో. కరవు వల్ల వాళ్ళ వూరు వదిలి, రాలే గావ్ సిద్ది కి వాళ్ళ కుటుంబం వలస వెళ్తుంది. అయన చదువు కొన్నాళ్ళు ముంబై లో సాగినా, చదువు కోసం అష్ట కష్టాలు పడి, పువ్వులమ్ముకున్నా,ఆయన చదువు సాగలేదు.పేదరికం వల్ల, ఏడవ తరగతి లోనే ఆపెయ్యాల్సి వస్తుంది.
అర్మి లో డ్రైవర్ గా చేరినా, ఆయన మీద వివేకానంద,గాంధీ ల ప్రభావం చాల ఎక్కువ. అరవై ఐదు లో అర్మి ని వదిలిన ఆయన నేరుగా తన సొంత వూరికి వెళ్లి దాని అభివృద్ధి కి తోడ్పడ్డాడు.అప్పటిదాకా తను దాచుకున్న సొమ్మంతా, గ్రామాభివృద్ది కే నియోగించాడు.మద్య పాన నిషేధం, చెట్ల పెంపకం పై దృష్టి పెట్టి, రాలే గావ్ సిద్ది సమగ్రాభివృద్ది కి కృషి చేసాడు.
గ్రామస్తుల స్వయం కృషి తో ఏర్పడ్డ ఇంకుడు గుతలు,చెక్ డాముల వల్ల నీటి కొరత తీర్చాడు.
ఆయన కు ప్రభుత్వాలు, ఇతర సంస్తలు నుండి ఎన్ని అవార్డులు వచ్చినా, అంతకు మించి జన భాహుళ్యం లో ఖ్యాతి నొంది నాడు.ఇవన్నీ ఒక ఎత్తూ. అయన ప్రస్తుతం చేస్తున్న ఉద్యమం ఒక ఎత్తూ. మన లోక హిత ప్రభుత్వం తూతూ మంత్రం గా ప్రవేశ పెట్టిన లోక్ పాల్ బిల్లు ఎందుకూ పనికి రాని, ప్రస్తుత వ్యవస్థ కే కొనసాగింపు గా ఉందన్న ఆలోచన తో, జన లోక్ పాల్ బిల్లు కు రూపకల్పన చేసారు. వాటి వివరాలు కింద చూడండి.
ప్రభుత్వ బిల్:
౧. లోక్ పాల్ తనంతట తాను ప్రజల నుంచి ఎటు వంటి ఫిర్యాదులు స్వీకరించలేదు. లోక్ సభ స్పీకర్ లేక రాజ్య సభ చైర్మన్ ప్రజా ప్రతినిదుల పై ఫిర్యాదులు చేయగలరు.
౨.ఇదొక సలహాలు ఇచ్చే సంస్త.అంటే, ఎదురుగ్గా అవినీతి జరిగిందని తెలిసినా, ఏ సంకీర్ణ రాజకీయాల భారం తో జుట్టు తెల్ల బడ్డ ప్రధానికి నివేదించడం తప్ప ఏమి చెయ్యలేదన్నమాట.దొంగల గురుంచి దొంగలతో చెప్పినట్టు,
౩.దీనికేటు వంటి పోలీసు అధికారాలు లేవు. క్రిమినల్ కేసులు పెట్టడం, ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చెయ్యడం చెయ్యలేదు.
౪.ఇతర చట్ట సంస్తల లో ఎటు వంటి సంభందాలు ఉండవు
౫.నిర్దారణ అయిన నేరానికి తక్కువలో తక్కువ అయిదు నెలలు శిక్ష.
ఈ పాటికి మీకు అర్ధం అయి ఉండే ఉంటుంది. ఈ పై సంస్త ఒక్క రాజకీయ నాయకుడిని చట్టం పరిధి లోనికి తీసుకు రాలేదని.
అన్న హజారే ప్రతి పాదిస్తున్న మార్పులు:
౧.లోక్పాల్ ఎవరి నుంచైనా ఆరోపణలు స్వీకరించవచ్చు.
౨.ఎవరి పైనేన, కేసులు నమోదు చెయ్యొచ్చు.
౩.సి బి ఐ అవినీతి నిరోధక శాఖ, లోక్పాల్ కలిసి పని చేస్తాయి.
౪.తక్కువలో తక్కువ అవినీతి నిరోపన నిర్ధారణ అయితే, అయిదు ఏళ్ళ శిక్ష.
౫. లోక్పాల్ సంస్త లో రాజకీయులు కాక, జన భాహుళ్యం లోని మేధావులు ఎక్కువ సంఖ్యా లో ఉండాలి,
లోక్పాల్ బిల్లు లో మార్పులు కోరుతూ, డిల్లి లో జంతర్ మంతర్ దగ్గర, హజారే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అదేదో మన రాష్ట్రము లో రాజకీయులు చేసే ఒక రోజు నిరాహారం, సాయంత్రం బిర్యాని దీక్ష అనుకునేరు.పప్పు లో కాలేసినట్టే.భారతీయ ఎన్నికలప్పుడు జైరాం పార్టీ దీనికి మద్దత్తిచిందని ఇదేదో రాజకీయ సంబంధం ఉన్న దీక్ష అనుకునేరు. అన్నా రాజకీయ నాయకులనేవ్వర్ని, తన వద్దకు రావద్దన్న సంగతి గుర్తు పెట్టుకోండి. చౌతాలా, ఉమా భారతి ఉత్తుత్తి కన్నీళ్ళతో మద్దతు ఇవ్వడానికి వచ్చి జనం తిరగ పడటం తో వెనుతిరిగారు.
అన్నా దెబ్బతో :
౧. నిన్నటి దాక ఇదేదో ఓవర్ ఆక్షన్ డ్రామా అన్న కాంగ్రెస్ వాళ్ళు..నిదానం గా దారి కొస్తున్నారు.
౨. శరద్ పవార్ అవినీతి ఆరోపణలతో అవినీతి నిర్మూలన మంత్రి మండలి నుంచి రాజీనామా చేసారు.
ఒక సామాన్య భారతీయుని గా, అన్నా కు నా సంపూర్ణ మద్దతు, ఈ బ్లాగ్ ద్వారా, అన్నా చేస్తున్న ఈ పోరాటం పై నిరంతర సమాచారం బ్లాగ్ లోకానికి అందించి, ఉడతా భక్తీ , ఆ మహానుభావునికి సహాయ పడతాను. మీరు ఈ మహోద్యమం లో మీకు తోచి నట్టు పాలు పంచు కుంటారని ఆశిస్తూ....జై అన్నా...జై హింద్....