Sunday, December 25, 2011

ఎవరో ఒకరు..ఎపుడోకపుడు...నడవరా ముందుగా..

       నేడు దేశం లో ప్రభుత్వమే   ఉందా లేదా అని జనాలకు అనుమానం రావటంలో తప్పు లేదు.ఎటు చూసిన అవినీతి, బంధు   ప్రీతి, కోట్ల కొలది విదేశి బాంకుల్లో మురుగుతున్న ప్రజాధనం. దేశంలో జరిగే వాటికే లెక్క లేదు, విదేశాల్లో ఎవరికెంత ఉందొ చెప్పలేం అని చేతులెత్తేసిన ప్రభుత్వం. అన్నిటికీ మించి అనంత కోటి అవినీతికి శతకోటి ఉపాయాలన్నట్టు పేట్రేగిపోతున్న  ప్రజా ప్రతినిధులు. చట్ట సభలు చట్టు బండలై, ఏలే వారి కొమ్ముకాస్తున్న వైనం.
     ఘనత వహించిన పార్లమెంటు,ఇతర చట్ట సభలు చేసే చట్టాలు దేశం కోసం కాదు, రాజకీయుల కోసమే అనేది నేడు నడుస్తున్న చరిత్ర..ఈ వ్యాఖ్యకు   లోక్పాల్ బిల్లు పై పార్లమెంట్లో నడుస్తున్న చర్చ.ఇపుడు నడుస్తున్న చర్చ చూస్తుంటే, ఈ బిల్లు ఎప్పటికి వెలుగు చూసేటట్టు లేదు. ఏకా భిప్రాయం మాట అటుంచి, ఎలాగోలా దీన్ని ఆపాలనే ప్రఘాడ ఆసక్తి ప్రస్పుటం గా తెలుస్తుంది.
        ఒకవేళ ఈ బిల్లు ఏదో రూపంలో ఆమోదం పొందితే, తమ కిందకు ఎక్కడ  నీల్లోస్తాయో అని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాగం అందుకుంటుంది. అదుగో పులి అంటే ఇదుగో పిల్ల అన్నట్టు, రోజుకింత ముద్ద తిని శివాలయం వసారాలో పడుకొనే ముసలాయన గురుంచి కూడా అవాకులు చెవాకులు పేలారు. అన్నా నిజాయితీ ని జనం శంకిస్తే, బిల్లును పక్కకు తోసి చేతులు దులుపుకోవాలనే దుగ్ధలో ఇదో భాగం  అని వినగానే అర్ధం అవుతుంది.ఆయన సంఘ్ పరివార్ దోస్తు అని ఒకరంటే, విదేశి శక్తులేవో ఈయన ఉద్యమం వెనకాల ఉంది నడిపిస్తున్నాయని ఇంకొకరు వ్రాక్కిచ్చారు.
                  ఇక రిజర్వేషన్ల సంగతి.నేటి రాజకీయం దుస్తితికి నిదర్శనం.కుల మత రాజకీయాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఈ వ్యవస్థలో ఇది ఒక తురుపు ముక్క. దశాబ్దాలుగా మహిళా బిల్లు ఆమోదం పొందక పోవడానికి ఇదే పెద్ద అడ్దంకి.ఎన్ని సార్లు ప్రయోగించినా మల్ల మళ్ళా వాడుకోవడానికి వీలైన భేషైన ఆయుధం.ఈ బిల్లు ముందుకు నడవకుండా ముందు కాళ్ళ భందం.
                 చర్చలో పదే పదే మన నాయకులు ప్రస్తావించిన మరో సమస్య, ఒక వ్యక్తీ ఉన్నతమైన చట్ట సభలను ఆదేశించే స్తాయికి ఎదిగారని, అది ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు అనిన్నూ.అయ్యా..ఆయనే ఉంటె మంగలాయన ఎందుకని, మీరు చక్కగా ఉంటె కొత్తదేవుల్లెందుకు. ఉన్న వ్యవస్థ గొప్పగా పనిచేస్తుంటే, కొత్త వ్యవస్తలు బిల్లులు ఎందుకు. అమోఘమని మనం కీర్తించుకునే రాజ్యాంగానికి ఇన్ని సవరణలు ఎందుకు. అవన్నీ ఎవరో ఒకరు ప్రతిపాదిస్తే, చర్చించి మార్చినవేగా..అయినా, ఆయన చేస్తున్న ఆందోళనలన్ని శాంతియుతమేగా..సంతియుతంగా విరోధం తెలపటం, ఆందోళన చేయటం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మరి దీనిమీద వీళ్ళకంత భయం ఎందుకో.
                 కాలానుగునంగా మన చట్టాలు మార్చుకోవటం సవరించు కోవటం తప్పు కాదు. వీరి భాషలోనే చెప్పాలంటే, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ లకు,నేడు దేశం లో ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం సంబంధం లేదు. మరి వీటిని పొడిగించటం, ఎన్నికలముందు కొత్త కులాలను చేర్చడం, ఉన్నవాటిని పెంచటం ఇవన్ని ప్రస్తుతం ఉన్న వ్యవస్తలను ఎలా గొప్పగా మనం వాడుకుంటూ ఉన్నామో చెప్పకనే చెప్తాయి.ఇంకొక గొప్ప ఉదాహరణ. ఆంధ్రాలో విధాన మండలి. విదాన సభలోనే వీరి ఫీట్లు చూసి జనం సిగ్గు పడుతుంటే, కేవలం రాజకీయ నిరుద్యోగులను బుజ్జగించ కోవటం కోసమే మండలిని పునరిద్దరించారంటే అతిశయోక్తి కాదు.మరి జనం అంతా వ్యవస్థలో మార్పు కోరుకుంటుంటే, వారిని ఒకరు ముందుండి నడిపిస్తుంటే తప్పేముంది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న సిగ్గుమాలిన వుద్యమాలకంటే అయన చేస్తున్నది తప్పా. వందలమందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను క్షమించాలని కొందరు ఉద్యమిస్తే, మాజీ ప్రధానిని చంపిన వారిని వదిలేయ్యని ఇంకో ఉద్యమం. మరి అలాటి వాటిలో వీరికి ఎటు వంటి తప్పు కనపడక పోవటం, యద్భావం తద్భవతి అన్నట్టు, మనం ఏది చూడాలి అనుకుంటే అదే కనపడుతుంది అని గీతా కారుడు చెప్పిన సత్యం.
                  ఏ ఉద్యమము అయినా ఒకరితోనే, ఒక మనిషి ఆలోచన తోనే ప్రారంభం అవుతుంది. జనం అతని విధానాలు, ఆశయాలు నచ్చి వెంట నడిస్తే అది ప్రజా ఉద్యమం అవుతుంది. నేటి రాజకీయులు మరుస్తున్న విషయం ఇంకొకటి ఉంది. నేడు ఈ అవినీతి వ్యతిరేక ఆందోళన జన ఉద్యమం. దీనికి చేష్టలుడిగిన ఏ వ్యవస్థ మద్దతు అక్కరలేదు. స్వప్రయోజనాలు కాపాడుకోవటానికి కిందా మీద పడుతున్న అతికొద్ది మంది మద్దత్తు దీనికి అక్కరలేదు.జనం మద్దత్తే  ప్రాణం.మరి దీనిని ఆపటం ఎవరి తరం.ఒక వేళ ఈ సారి కాక పొతే, వచ్చే సభలో నైనా..జనం దీనివెనుక ఉన్నంత కాలం జనాలకు ఉపయోగపడే విధంగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశా సజీవమే...

                                                          -------జై హింద్----

             



లోక్ ఫూల్-అమెరికతలు-౧౧

లోక్ ఫూల్ బిల్లు లో కొన్ని ముఖ్యాంశాలు :

౧.కేంద్రం లో లోక్ ఫూల్. రాష్ట్రం లో లోకా భుక్త. అక్కడ 9  మంది.అందరు మొదటి కేసు చూసేలోగా టపా కట్టేంత ముసలోళ్ళు( అనుభవజ్ఞులు అని చదువుకోండి పాపం).ఇందులో కూడా బ్యాక్ వార్డ్ రిజర్వేషన్ కింద 4 గురు. మత రిజర్వేషన్ కింద ఇద్దరు, అమ్మగారి రిజర్వేషన్ ఒకటి.యువ నేత రిజర్వేషన్ ఒకటి. మిగిలిన బూడిద జనాలకి.

౨.దీనికిన్డకు ప్రధాని వస్తాడు కాని, ఏవైతే ప్రభుత్వ శాఖలు ఆయన కిందకొస్తాయో వాటిలో ఆయనను విచారించకుండా ఎప్పటి కప్పుడు ఈ బిల్లు ని సవరించాలి.

౩. ఇంకా,ప్రధానిని విచారించాలంటే, మొత్తం లోక్ ఫూల్ సబ్యుల్లో మూడో వంతు మంది ఒకే రోజులో నలభై మైళ్ళు నడిచి సాయంత్రం అయిదు లోగా ప్రధాని ని ఆయన ఆఫీసు లో పట్టు కొని విచారించాలి, ఆ రోజు ప్రధాని దొరక పొతే, తర్వాత రోజు ఇదే పద్దతి లో ప్రయత్నించాలి. వారికి మూడే అవకాశాలు ఇవ్వబడతాయి. అప్పటికీ వారు ప్రధానిని విచారించలేక పొతే తర్వాత సంవత్చరం ప్రయత్నించాలి.

౪.అందరు ఉద్యోగులు లోక్ఫూల్ పరిది లోకి. కాని వారిని విచారించేది కే బీ సి. వారు మూడు ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తే,వారు నిర్దోషులు గా ప్రకటించబడతారు.

౫. దీని సభ్యుల ఎంపికకు అన్వేషణ కమిటీని తీహార్ జైల్లో ఉన్న మంత్రులతో ఏర్పాటు చేస్తారు. కామన్ లూట్ పోటీలు, ౩ జీ స్కాం లో ఉన్న వారికి ప్రత్యెక రిజర్వేషన్.

౭. జీ బీ అయి లాంటి సంస్తలపై వీరికి ఎటు వంటి నియంత్రణ ఉండదు. అంతెందుకు, వీరి ఆఫీసు అద్దె కూడా వీరే కట్టుకోవాలి. కూర్చో డానికి కుర్చీలు బల్లలు తెచ్చుకోవాలి. లేకపోతే కింద కూర్చోవాలి.

౯. వీరు నేరం నిరూపిస్తే, నాలుగు గుంజీలు తీయాలి. ఒకేసారి తియ్యలేక పొతే రెండు మూడు విడతలు గా చెయ్యవచ్చు.కనిష్ట శిక్ష రెండు  గుంజీలు.

అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి, బిల్లులో ఈ కింది మార్పులు చేయటానికి పరిశీలిస్తున్నట్టు న్యాయ  శాఖ మంత్రి ప్రకటించారు.

౧. అధికారం లో ఉన్న పార్టీ కి లోక్ ఫూల్ కమిటీలో యాభయి శాతం సీట్లు. మిగతావి సంకీర్ణ భాగస్వాములకు,ప్రతిపక్షానికి కేటాయించారు.ఈ దామషాలోనే మత ప్రాతిపదికన కూడ  రిజర్వేషన్లు అమలు జరపటానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు.అలాగే ఇందులో కుల ప్రాతిపదికన కూడ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని దక్షిణాదికి చెందిన ఒక పార్టీ కోరింది.
౨. సంకీర్ణ భాగ స్వాములకు సంబందించిన పార్లమెంట్ సభ్యులకు ఇందులో మినహాయింపు కల్పిస్తారు. నల్ల కళ్ళజోడు పెట్టుకునే దక్షినాది నాయకులు వారి కుటుంబ సబ్యులను ఇందులో నుండి మినహాయించాలని ఒక పార్టీ సబ్యులు లోక్ సభలో భేటాయించి మరీ కోరారు.నల్ల కళ్ళజోడు అనే వాక్యాన్ని బిల్లు లో తప్పని సరి గా చేర్చాలని కోరారు.
౩. జీ బీ అయి కి ప్రతి గా వేరే దర్యాప్తు సంస్తను లోక్ ఫూల్ కింద ఏర్పాటు చేస్తారు. వారికి అధునాతనమైన పేము బెత్తాలు, కిర్రు చెప్పులు, ప్రభుత్వమే సమకూరుస్తుంది.
౪.గడ్డి సంబందిత వ్యవహారాలను ఇందులో నుండి మినహాయించాలని ఉత్తరాది కి చెందిన ఒక నాయకుని ప్రతిపాదన ను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
౫. ఎటు వంటి నిరాహార దీక్షలు అనుమతించ రాదనీ దీనివల్ల ప్రజా జీవితానికి భంగం కలుగు తుందని, ఇటీవల కాలం లో బీహార్ వలస వాసులను ముంబై నుండి కొట్టి  తరిమేసిన ఒక పార్టీ ఘట్టిగా కోరింది.ఇదే పార్టీ బిల్లు మరాటి లోనే ఉండాలని మిగత వాళ్ళు కావాలంటే తర్జుమా చేసుకోవచ్చని ప్రకటించింది.
౬.ఒకవేళ ఈ బిల్లు అమలు అయిన పాత కేసులు పరిసీ లించరాదని తీహార్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రుల కమిటీ కోరింది.

Saturday, December 10, 2011

హ్యాపీ ప్రిన్స్-అమెరికతలు-౧౪

ఒక మహా నగరం. నగరం కూడలి లో ఒక పెద్ద విగ్రహం. ఒకానొక కాలంలో ఆ దేశాన్ని పాలించిన రాజకుమారునిది. జనం మురిపెంగా ఆ విగ్రహాన్ని హ్యాపీ ప్రిన్స్ అని పిలుచుకునే వాళ్ళు. అందుకు అనుగుణం గానే ఆ విగ్రహం ఎంతో అందంగా ఉండేదట.కంచు తో చెయ్యబడ్డ ఆ విగ్రహానికి బంగారు పూతలు పూసారు. కళ్ళు నీలాలు.ఆయన నడుముకు వేళ్ళాడే కత్తి కూడా బంగారమే.దాని పిడికి ఒక కెంపు ఉండేదట. నగరం నది బజారులో ఆ విగ్రహం బంగారు వన్నెలతో కాన్తులీనేది.
ఒక రోజు ఎక్కడనించి వచ్చిందో ఒక చిన్న పిట్ట. ఆ నగర వీధుల్లో గిరికీలు కొట్టింది. తన వాళ్ళంతా దక్షిణ దిక్కుకి పోతున్నారు కాబోలు..అది కూడా అటే బయలు దేరింది. వచ్చేది సీతా కాలం ఏమో, చలి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చిన్న పిట్ట చలి నుంచి కాచుకోవటానికి తన రెక్కలను అదే పని గా అల్లార్చుతుంది. సాయంత్రం దాక ఆ వూరి అందాలను చూసిన పిట్ట, తన వాళ్ళనుంచి విడిపోయినట్టు గ్రహించింది. అరె..వీళ్ళంతా చాల దూరం వెళ్లి ఉంటారు..కాని ఏమి చేస్తుంది.చీకటి పడింది. రాత్రి కి ఎక్కడో తలదాచుకోవాలని చూస్తున్న  దానికి, హ్యాపీ ప్రిన్స్ విగ్రహం కనపడింది. ఈ విగ్రహం కాళ్ళ దగ్గర ఈ రాత్రి గడిపెయ్యాలని  అనుకుంది.
హాయిగా కాళ్ళదగ్గర పడుకున్న దానికి ఏదో పెద్ద చినుకు మీద పడ్డట్టు అనిపించింది.తలెత్తి చూస్తుంది కదా,రాకుమారుడి కళ్ళనుండి నీళ్ళు.ఏమైంది రాకుమారా...తన చుట్టూ తిరుగుతూ అడిగింది.
నేను రాజ భవనంలో ఉన్నప్పుడు నా ప్రజలు ఎలా ఉన్నారో నాకు తెలిసేది కాదు. కాని ఇప్పుడు చూస్తే, నా నగరం అంతా విషాదం,ఆకలి, చావు లతో నిండి ఉంది. మరి నా ప్రజలు ఇంత కష్టపడుతుంటే నా కళ్ళలో కన్నీరు తిరగటం లో ఆశ్చర్యం ఏముంది. అదుగో చూడు, ఆ నది వొద్దు అవతల ఒక తల్లి గుడ్డి దీపపు వెలుగు లో ఒక గౌన్ కుడుతుంది. ఆ చీకటి లో సూది గుచుకోవటం వల్ల ఆమె వేళ్ళు గుల్లబారి పోయినాయి. అదే గది లో ఒక మూల ఆమె కుమారుడు జ్వరం తో పడి ఉన్నాడు. వాడు మూడు రోజుల నుండి కమలా పళ్ళు అడుగుతున్నాడు. కాని ఆమె దగ్గర వాడికివ్వటానికి నది నీరు తప్ప వేరేమి లేదు.
ఓ నా చిన్నారి పిట్టా, నా ఖడ్గం నుండి కెంపు తీసుకెళ్ళి వారి కివ్వు. అది వారిని కొన్నాళ్ళైనా సుఖపెడుతుంది. పిట్ట ఆలోచించింది. ఆహా, యెంత మంచి ఆలోచన ఈ రాజకుమారునిది. చటుక్కున అది కెంపు నందుకొని తుర్రున ఎగిరింది. ఊరంతటి ని దాటి నదిని దాటి ఎగిరింది.ఆ ఇంటి కిటికీ లోంచి కెంపు ను జార విడిచింది.
ఆ రాత్రి విగ్రహం కాళ్ళ మద్య వెచ్చగా నిదురించింది.మరుసటి రోజు ఉదయం.పిట్ట తొందరగా లేచింది. తన దక్షిణ ప్రయాణానికి బయలుదేరుతూ రాకుమారునికి ఒక మారు చెప్పేందుకు వెళ్ళింది.ఓ  నా చిన్నారి పిట్టా..నీ ప్రయాణం   సుఖమగుగాక... కాని వెళ్ళే ముందు నాకొక పని  చేసిపెడతావా...అలానే..అంది పిట్ట.
వూరికి ఉత్తరాన ఒక కవి ఉన్నాడు. తను అందమైన కావ్యం రాయ పూనుకొన్నాడు. కాని పేదరికం ఆకలి వల్ల ఏమి చెయ్యలేకున్నాడు. వానికి రోజుల తరబడి ఆహారం  లేదు. రమణీయమైన కావ్య రచన చేసే కవి అలా బాధ పడటం నేను చూడలేకున్నాను.నా కళ్ళు నీలాలు. ఒక కన్ను తీసుకొని తనకివ్వు.
పిట్ట తటపటాయించింది. మరి మీ కళ్ళు. ఇంకొక కన్ను ఉంటుంది కదా మరేం పర్లేదు.పిట్ట అలానే చేసింది. అలా ఆరోజు కూడా పిట్ట ప్రయాణం వాయిదా పడింది.
తర్వాత రోజు రాజకుమారిని విగ్రహం కింద ఒక చిన్నారి కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. రాజు పిట్టను పిలిచాడు.చూడు..ఆ పిల్ల అగ్గిపెట్టెలు అమ్ముతుంది.ఈ రోజు అగ్గిపెట్టెలు అన్ని కాలవలో పడి పోయాయి.ఖాళి చేతులతో ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న అసలే తాగు బోతు. ఆ పిల్లను చంపేస్తాడు.నా రెండో కన్ను కూడా ఆ పిల్ల కు ఇచ్చేద్దు..నీకు పుణ్యం ఉంటుంది.
సరే..విగ్రహం రెండో కన్ను కూడా ఆ పిల్లకు ఇవ్వబడింది.పిట్టకు ఆ రాజకుమారుని మీద యెనలేని ప్రేమ కలిగింది. అయ్యో ఇప్పుడు అతను ఎలా చూస్తాడు..మరి కొన్ని రోజులు అక్కడే ఉండి, నగర విశేషాలన్నీ చెప్పాలని నిర్ణయించుకుంది.
అది చెప్పే బాధలు కస్టాలు విని, రాజు గుండె కదిలింది. తన విగ్రహం మీదున్న బంగారు పూతలను నగరం లో బాధలు  పడే ఒక్కొక్కరికి పంచమని అర్దిస్తాడు.కొన్ని రోజులకు విగ్రహం మీద ఉన్న బంగారం అంతా ఖాళి అయిపోతుంది.విగ్రహం కళా విహీనం అవుతుంది.
ఇలా జరుగుతుండగా, పిట్ట చలికి తాళలేక పోతుంది. మంచు కాలమేమో, దానికి తల దాచుకునే ప్రదేశము కరువవుతుంది. రోజుల తరబడి నగర ప్రయాణంతో తనలో చివరి శక్తీ హరించుకు పోయిందని అర్ధం అవుతుంది.చివరి సారి విగ్రహం తో అది మాట్లాడుతుంది. మిత్రమా..నువ్వు నాకు నా ప్రజలకు ఎంతో సేవ చేసావు..నీ దక్షిణ ప్రయాణమునకు చాలా ఆలస్యం అయింది.బయలు దేరు..తిరుగు ప్రయాణం లో నను మరువకు సుమీ..రాజు అభ్యర్ధించాడు.రాకుమారా, నాలో శక్తి లేదు అంతదూరం వెళ్ళడానికి, నా అంతం సమీపించింది.ఈ తనువు భూమిపై రాలే ముందు చిన్న అభ్యర్ధన. చెప్పు మిత్రమా. చివరి సారి మీ పెదవులు చుంబించాలని కోరిక.
పిట్ట కోరిక తీర్చబడింది. ఆయువు వీడిన దాని శరీరం నిర్జీవమై విగ్రహం పాదాల దగ్గర పడిపోయింది.అదే సమయం లో విగ్రహం లో పెద్ద శబ్దం.దాని గుండె పగిలింది.
నగర పర్యటనకు వచ్చిన ఆ నగర మేయర్, విగ్రహాన్ని చూసాడు.పూర్తిగా కళా విహీనం అయన  దానిని అక్కడనుంచి తొలగించాలని అజ్ఞాపిస్తాడు.అట్లే, విగ్రహం తొలగించ బడుతుంది.కంచు కోసం అది కరగించబడుతుంది.
కాని వారు విగ్రహం గుండెను కరగించలేక పోతారు. ఎన్ని సార్లు కరిగించినా, అదే అట్లే ఉండెను.వారు దానిని రోడ్డు పక్కన పారవేసిరి.యాదృచ్చికమేమో పక్కనే పిట్ట శరీరం పడి ఉండెను.
ఆస్కార్ వైల్డ్ రాసిన ఈ కధ. మానవ లక్షణాలైన దయ,స్నేహం,ప్రేమలను విగ్రహాలకు, పక్షులకు ఆపాదించినా,కధ చదువుతున్నంత సేపు మీకా ఆలోచన రాక పోవడం కధకుని గొప్పతనం.
చిన్నప్పుడు చదివిన ఈ కధ.ఈ రోజు చదివినా, ఎంతో బావుంటుంది.అంతం కొంచెం బాధా కరమైనను, అవ్యాజమైన ప్రేమ,స్నేహం విడిపోని బంధాలన్నీ, అవి ప్రతి పరిస్తితి లో తోడు నిలుస్తాయని అనిపిస్తుంది.ఈ కధకు ఇంత కన్నా గొప్ప అంతం ఉండదేమో అనిపిస్తుంది.

Thursday, November 24, 2011

సత్యం..ఒక మరపురాని జ్ఞాపకం...


ఏం శరత్ ఎలా ఉన్నావు... చిరపరిచయమైన పిలుపు. స్నేహం నిండిన ఆ కళ్ళు, స్వచ్చమైన   నగు మోము. సత్యానికివే చిరునామాలు. ప్రతీసారి నా ఒంగోలు యాత్రలో ఎదురై పలకరించే అతికొద్ది మంది మిత్రుల్లో తను ఒకడు. 
మా పరిచయం ౬-౭ ఏళ్లది. అది సంధి కాలం.నేను IT లో ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్న రోజులు. హైదరాబాద్ లో ఏదో ఉద్యోగం వెలగ పెడుతూ, పూర్తి ప్రయత్నం దీని మీద చేసేవాడిని. ప్రతి నెలలో ఒక్కసారైనా వూరికి రావటం. అందరిని కలవటం చేసే వాడిని. వచ్చిన ప్రతి సారి కరెంట్ ఆఫీసు ( మా నాన్నగారు అందులో నే పని చేసేవారు) కి వెళ్ళటం, పొద్దునా సాయంత్రం అక్కడ మిత్రులతో బాతాఖాని, కుదిరితే, సాయం కాలాలు షటిల్ ఆడుకోవటం. వెళ్ళిన ప్రతిసారి సత్యం కలిసేవాడు. తను చిన్న చిన్న ఎలెక్ట్రిక్ పనులు చేస్తూ అదే ఆఫీసు లో టెంపరరీ గా పని చేసేవాడు. 
మాలా వూర్లేమ్మట పడి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం లేని స్తితిమంతులు వాళ్ళు. నిజం చెప్పాలంటే తనకు ఆ ఉద్యోగ అవసరం యెంత మాత్రము లేదు. కాని తన కంటూ ఒక పని, గుర్తింపు ఉండాలనే సత్తె కాలపు మనిషి. డిగ్నిటీ అఫ్ లేబర్ గురుంచి తెలుసుకోవాలంటే, సత్యాన్నే అడగాలి.ఆఫీసు లో ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులు తనవే అన్నట్టు ఉంటాడు. ఇంట్లో పెళ్ళికొచ్చిన ౩  గ్గ్గురు  అక్క చెల్లెళ్ళ భాద్యత, వయసుడిగిన పెద్దవాళ్ళు ,వీళ్ళందరిని వదిలి ఎక్కదికేల్తాంలే బాబాయ్ అని ఒకటి రెండు సార్లు అన్న గుర్తు.
అదే కాలం లో మా పరిచయం పెరిగింది. నెలల కొద్దీ సాగుతున్న ఉద్యోగ ప్రయత్నాల గురుంచి నేను కొద్దిగా నిరాస గా మాట్లాడినా, అదే వస్తాదిలే శరత్ కొంచెం ఓపిక పట్టు. నువ్వు మాత్రం వదలక ప్రయత్నించు అనే వాడు. మిగతావాళ్ళతో కలిసి నా ధైర్యం పెంచే ప్రయత్నం చేసేవాడు. మాకేలాగు కుదరదు ఇల్లాంటి జాబ్స్ ట్రై చేయటానికి, వయసు, అవకాశం ఉన్న మీలాంటి వాళ్ళు ట్రై చెయ్యక పొతే ఎలా...
నిజమే. త్వరలోనే నాకు జాబు వచ్చింది. అలాగే నేను ఒంగోలు రావటం పోవటం తగ్గాయి.నేను చెయ్యకపోయినా వచ్చినపుడల్లా, నా బాగోగుల గురించి ఇంట్లో వాకబు చేసేవాడు.నేనేదో సాధించేసాను అన్న భావం తనతో మాట్లాడిన ప్రతి సారీ నాకు కలిగేది. జీవితం లో కష్టపడి పైకి వచ్చావ్ అబ్బాయి...సామాన్యంగా ఇంట్రోవేర్ట్ అయిన సత్యం నుంచి వచ్చిన నేనెప్పుడు తలుచుకునే కామ్ప్లిమెంట్లు. 
అల్లాంటి సత్యం నేడు లేడు అని అమ్మ ఫోన్ చేసినప్పుడు నమ్మ బుద్ది కాలేదు.  నిజంగా పొద్దున్నే నిద్రలో నేను కలవరిస్తున్నానేమో..ఇదంతా కలేనేమో...
లేదురా...కరెంట్ పని చేస్తూ షాక్ కొట్టి..అమ్మ ఇంకా మాట్లాడలేదు...తన నవ్వు మొహం నా ఊహల్ని కప్పేసింది. ఏం ఎందుకని ఏం తప్పు చేసాడు తను...నేనేరుగగా..ఎవరిని పల్లెత్తు మాట అనలేదు..ఎవరి గురుంచి తప్పు మాట్లాడలేదు...నిజంగా దేవుడనే వాడు ఒకడు ఉండి, తనే జన్మ మరణాలకు కారణం అయితే, ఆయన చాలా తప్పు చేసాడు. తన ఇద్దరు చిన్నారుల మొహం చూసి అయినా ఆ పాపిష్టి దేవునికి దయ రాలేదా...నాన్న యేడి అని వాళ్ళు అడిగితె, అయన ఏమి సమాధానం చెప్తాడు..ఇంకా నూరేళ్ళ జీవితం ముందుంది కదా...అప్పుడే ఎందుకిలా..
తన మరణం నాకింకా నమ్మ శక్యం కాదు...నా లాజిక్ కి అందదు...కాని ఒకటి మాత్రం నిజం.దేవుడు చాల చిన్న చూపు చూసాడు...అతనిమీద అతని కుటుంబం  మీదే కాదు...తన చిరునవ్వుతో రోజు స్పూర్తిని పంచే పలకరించే నాలాంటి యెంతో మంది మీద..

Monday, November 21, 2011

బొమ్మేనక బొమ్మ పెట్టి...అమెరికతలు-౧౨

ఈ రోజు టీవీ ౯ లో ఒక వార్త. ఝాన్సీ లక్ష్మి బాయి నిజంగా బ్రిటిష్ వారిపై యుద్ధం చెయ్యలేదని, అదంతా ఝాల్కారి బాయి అనే ఆమె ఝాన్సీ బాయి లా యుద్దానికి వెళ్లి,యుద్ధం చేసిందని.ఆమె నిమ్న వర్గాలకు చెందినది కావటం వలన, ఆమె పేరు అణగదొక్కి ఝాన్సీ బాయి కి గొప్ప పేరు రావటం వెనక ఉన్నత వర్గాల కుట్ర దాగి ఉంది అని ప్రస్తుత ముక్క చెక్కల పోలిటిక్స్ హీరోయిన్ మాయావతి ప్రభుత్వ ఉవాచ. త్వరలో లక్నో లో మాయావతి బొమ్మ పక్కన రోడ్డుకు అడ్డంగా ఝాల్కారి బాయి బొమ్మట్టేస్తామని వెనకబడ్డ బొమ్మల సముద్దరణ కి బ్రేసులేటు కట్టుకున్న ( ఈమె చాల మోడరన్ను) మేడం గారి శపధం.
సరే ఇదంతా నిజమే అనుకుందాం.పాపం శమించు గాక. నిజంగానే ఇదంతా నిజమనే అనుకుందాం. ఏవిదం గా చూసినా రత్న గర్భ అయిన ఈ దేశంలో, రక రకాల రాజ వంశాల కింద నలిగిన జనం ఎవరికి పట్టారు. రాజ భోగాలను భావించిన వీరు తమ తమ భోగాలను కాపాడు కోవటానికి సైనిక రాజ్యాలు ఏర్పాటు చేసారు కాని, సామాన్యుల సంగతి పట్టినది ఎందరికి.భారత్ రక రకాల సంస్తానల క్రింద మగ్గుతున్నప్పటికి ఆనాటి లెక్కల ప్రకారం క్రీస ౧ శతాబ్దం నుంచి ౧౮ వ శతాబ్దం వరకు ప్రపంచపు అతి పెద్ద ఆర్దిక వ్యవస్థ. అక్బర్ బొక్కసపు సంవచ్చరిక లెక్క పదహారు మిల్లియన్ పౌండ్లు.మరి రెండు వందల సంవచ్చారాల తర్వాత బ్రిటిష్ రాణి ఆదాయం పెదిహేడు మిలియన్లు.అంటే, ప్రపంచం పిక్కలతో లెక్కలు నేర్చుకునే కాలం నుంచి అప్రతిహతం గా భారత దేశం సుసంపన్నం.మరిన్ని వివరాలకు క్రింద లింక్ చూడండి.
http://en.wikipedia.org/wiki/Economic_history_of_India 

మరి ఈ కాలం లో జనం మంచిగా బ్రతికి ఉంటారు అనుకుంటున్నారా? ఇక్కడ జనం ఎప్పుడు ఒకేలా ఉన్నారు. ప్రతి రాజు తన రాజ్య కాంక్ష తో భోగలాలస తో ఆ పన్ను ఈ శిస్తు అని జనం నడ్డి విరిచేవాడే. హిందూ రాజుల మాట అటు పెడితే, ముస్లిం రాజులు జన హననాన్నే తమ ప్రధాన కార్యం చేసుకున్నారు. వారు దండెత్తి వచ్చిన ప్రతి సారి లక్షలాది మంది హిందువులను వధించేవారు.లేక బానిసలు గా తీసుకు వెళ్ళేవాళ్ళు.
http://en.wikipedia.org/wiki/Islamic_invasion_of_India
తమ మతమేదో తమది అన్నట్టు, పరాయి దేవాలయాలను నుగ్గు నుగ్గు చేసేవారు. స్వార్ద చింతనే పరమావదిగా మన రాజులు కొందరు పరాయి వారికి సహకరించడం మామూలే.మోఘలులనుంచి బ్రిటిష్ వారి దాక ప్రతి పరాయి వలసవాదులు దీనినే అలుసుగా తీసుకున్నారు.విభజించి పాలించడం వారి పద్దతి అని చదూకున్నా,మన బంగారం మంచిది ఐతే అనికూడా చదుకోవాలి కదా.
చారిత్రికంగా,భారత భూమి రక రకాల నదులతో ప్రతి సారి కనికరించే రుతుపవనాలతో అన్నపూర్ణ.తిండికి బట్టకు లోటు లేక పోవడం వల్లనే మన దేశం లో భాష, అమోఘమైన పద్దతి లో గణితం,భిన్నమైన రచనా సంగతులు,ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు రచించ బడ్డాయి. మరి ఇవన్ని సామాన్యులకు అందాయా అంటే, మన దేశపు వర్ణ వ్యవస్థ సమాజాన్ని రక రకాల ముక్కలు చేసి చదువు సంధ్య కొందరికే పరిమితం చేసింది.
మరి వీటన్నిటికి పై వార్త తో ఏమిటి సంబంధం అంటారా..బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసిన ప్రతి రాజ్య వ్యవస్తా, తమ తమ స్వప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే ప్రయత్నించాయి కాని,దేశ ఉమ్మడి ప్రయోజనాల గూర్చి కాదు.అందుకే చరిత్ర లో ఒకటి రెండు  చోట్ల తప్ప పూర్వ సంస్తానాదీసులు ఉమ్మడిగా తిరుగు బాటు చేసినట్టు తెలియదు.

తమ కంటి ని తామే పోడుచుకున్నట్టు, బ్రిటిష్ వ్యవస్థ అందించిన విద్యా వ్యాపార అవకాశాలను అంది పుచ్చుకున్న భారత యువతరం స్వతంత్ర పోరాటాన్ని మరో మలుపు తిప్పింది. గాంధీ,గోఖలే,బోసు,భగత్ లేనా...మరి మౌలానా ఆజాద్,ఇక్బాల్ లాంటి నేతలు ఇందులో ప్రాతఃస్మరణీయులు.విభిన్నము సుసంపన్నమైన భారత జాతికి మణి పూసలు. సరోజినీ,దుర్గా బాయి లాంటి అమ్మలు మహిళా శక్తి స్వరూపునులు .చతుర్వర్ణాలు కలిసి రావటం తో పాత సంస్తానాదీసులు కూడా జనం తో గొంతు కలపక తప్పలేదు.మరి అలాంటప్పుడు ఇల్లాంటి సంస్తానాలు గెలిచినా ఓడినా జనాలకు ఒరిగి ఉండేది ఏమి లేదు. ఇంకా వీళ్ళందరికీ బొమ్మలు పెట్టే సిమెంటు తో నాలుగు రోడ్ల లో గతుకులు పూడ్చినా జనం సుఖ పడతారు.
Winston Churchill … & his argument against granting India / Pakistan independence …
“Power will go to rascals, rogues, freebooters … All leaders will be of low caliber & men of straw … They’ll have sweet tongues & silly hearts …
They will fight amongst themselves for power & the two countries will be lost in political squabbles … A day would come when even air & water will be taxed.”

అరవై నాలుగేళ్ళ క్రితం చర్చిల్ మాటలు. కొందోకంచో నాకు ఒక వైపు నవ్వు మరో వైపు కోపం తెప్పించేవి. కాని ఇప్పుడు పరిస్తితి చుస్తే ఆయన చరిత్రలో  ఎందుకు గొప్ప వాడు అయ్యాడో తెలుస్తుంది. మరి ఇల్లాంటి నాయకుల నుంచి ఏమి ఆశిస్తారు. రోడ్ల కడ్డంగా మాయ అమ్మ,కాన్షి రాం ల బొమ్మలు, ఇంకా ఈ మాత్రం పరపీడన చరిత్ర లో పిడకల వేటలో పట్టు కొచ్చిన మరో నాలుగు బొమ్మలు పెడితే రేపు నాలుగు ముక్కలయ్యే రాష్ట్రం లో ఏదో రెండు ముక్కల్లో నైన గొర్రె జనం వోట్లేయ్యక పోతారా..తదాస్తు....

 

Sunday, October 30, 2011

మోటర్ సైకిల్ డైరీ అమెరికతలు-౧౦

౬౧  ఏళ్ళ క్రితం...
దక్షిణ చిలి లో ఒక ప్రాంతం. సమయం సాయంత్రం ౮:౩౦
వొరేయ్ నా మాట విని వెనక్కు రారా..
మీ అమ్మకు నేనేమి చెప్పాలి..మామూలు గ చెప్తే అర్ధం కాదా
అమెజాన్ నది ఒడ్డున నిలబడి అరుస్తున్నాడు ఒక ముప్పై ఏళ్ళ యువకుడు.
పోరా పో..పుట్టిన రోజే నీ చావు రాసి ఉంది
వాడి మొహం లో అసహనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
వాడి మాటలు విన్నారేమో చుట్టూ పక్కల జనం పోగవుతున్నారు.
గువేరా...మొండి గ ప్రవర్తించకు..నది పోటు మీదుంది...ఆవలి ఒడ్డు కు పోలేవు...
అరిచింది పక్కల చర్చి లో పని చేసే నన్.
అందరి మొహాల్లో ఆందోళన, అసహనం,కోపం,కొండకొంచో బాధ.
ఇవేవి పట్టనట్టు నదిలో ఈదుతున్నాడు ౨౩ ఏళ్ళ యువకుడు.
సగం దూరం దాటి వచ్చేసాడు. కాని పోతెట్టుతున్న అమెజాన్ ప్రవాహం తో పోటీ పడలేకున్నాడు.
దానికి తోడూ ఆస్తమా రోగి ఏమో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.ఆవలి వైపు దీపాలు మినుకు మినికు మంటున్నాయి. చేతులు ఆడిస్తున్నాడు కాని దూరం ఇంకా ఎక్కువవుతున్నట్టుంది. ఆవలి వైపు గుమిగూడిన జనం అరుస్తున్నారు."గువేరా కం ఆన్ యు కాన్ డు ఇట్" 
లీల గా వినపడుతున్నాయి. కాని మద్యలో శ్వాస తీసుకోవడం కష్టం అయి పోతుంది. ఎదురుగా కనపడుతున్న దీపాలు స్పష్టత కోల్పోవడం తెలుస్తుంది. చేతులు ఆడించడం కూడా ఆపేసాడు గువేరా..ఇంతలో రెండు బలమైన చేతులు అతన్ని లాక్కేల్లటం తెలుస్తుంది. ఆవలి వొడ్డున ఉన్న జనం ముందు వెనుక ఆలోచించ కుండ నదిలో దూకారు తనని కాపాడటానికి.
ఆరోజు జూన్ ౧౪. అతని పుట్టిన రోజు. సావో పాబ్లో లో ఉన్న కుష్టు వ్యాది చికిత్స కేంద్రం.అమెజాన్ నది ఒక వొడ్డున రోగులు ఉండే చిన్న దీవి. మరో వైపు డాక్టర్లు,నర్సులు, మరి ఆ కేంద్రం నిర్వహించే క్రిస్టియన్ నన్లు ఉండే ప్రాంతం.రాత్రి పూట ఎవరు ఇటువైపు నుంచి అటు వెళ్లారు. కుష్టు అంటూ వ్యాది కాదు అనే ఎరుక ఉన్నప్పటికీ వ్యాది గ్రస్తులని దూరంగా ఉంచడం పరిపాటే.
సరిగ్గా, ౭ నెలల క్రితం అర్జెంటినా నుండి బయలుదేరారు ఈ ఇద్దరు మిత్రులు. ఒకరు గువేరా.మెడిసిన్ విద్యార్ది.ఇంకొకరు అల్బెర్టో. బయో కెమిస్ట్రీ విద్యార్ది. వయసు ఇచ్చిన ఊపు తో దక్షిణ అమెరికా చుట్టేయ్యాలని ఇద్దరి తపన.సాధనం  ఒక డొక్కు నార్టన్ ౫౦౦ మోటర్ సైకిల్.౪ నెలల్లో ౮ వేల కిలోమీటర్లు తిరిగేయ్యలని ప్రయత్నం.అర్జెంటిన  ,చిలి,పేరు,వేనుజువేల ల మీదుగా తిరిగి అర్జెంటిన అనేది పూర్తి ప్రయాణం.
వారు ఏది అనుకోని బయలు దేరినా, సిద్దార్దుడు బైట ప్రపంచం చూసి ఆవేదన చెందినట్టు, ఇద్దరు మిత్రులు దక్షిణ అమెరికా లోని విభిన్న ప్రాంతాల్లో తాండవిస్తున్న పేదరికాన్ని చూసి కొత్త పాఠాలు  నేర్చుకుంటారు. రక రకాల కష్టాలకు, అణచివేతకు గురి అవుతున్న పేద అమెరికన్లను చూసి పెట్టు బడి దారి వ్యవస్థ అందరి భందువు కాదని అర్ధం చేసుకుంటారు. ముఖ్యం గా వలస విధానాలతో అన్నీ కోల్పోయిన నేటివ్ అమెరికన్లను, కేవలం జ్వరానికి కూడా మందులు కొనలేని, ఆస్పత్రి కి వెళ్ళలేని వారి దైన్యం ఇద్దరినీ కదిలిస్తుంది.
చిలి లోని అనకొండ కాపర్ గనుల్లో పని చేసే కార్మికుల స్తితి వారిని వెంటాడుతుంది. రేపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్తితుల్లో గంటల కొద్ది కనీస అవసరాలైన తాగు నీటికి కూడా నోచుకోని  కార్మికులు అక్కడి గనుల్లో మగ్గిపోవటం, కొన్ని సందర్భాలలో గాలి కూడా ఆడక అసువులు బాయటం గువేరా మనసులో  చెరగని ముద్ర వేస్తుంది. ప్రపంచం పెద్ద పెద్ద నగరాల్లో, పెట్టు బడి దారుల ఆకాశ హర్యాల్లో లేదని, ప్రపంచం అంటే అనుదినం అణచివేతకు గురయ్యే రైతుల,కార్మికుల సంఘర్షణ లో ఉందని వారి జీవన పోరాటం లో ఉందని మిత్రులు గ్రహిస్తారు.
వారి చివరి మజిలి సావో పాబ్లో లో కుష్టు వ్యాది చికిత్స కేంద్రం. ఇద్దరు అక్కడ ఉచితం గా సేవలు అందిస్తారు.ఐతే అనుకోకుండా గువేరా పుట్టిన రోజు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే వస్తుంది. రాత్రుళ్ళు రోగుల వైపు వెళ్ళని చికిత్స కేంద్రం పద్దతులను కాదని, ఆవలి వొడ్డుకు పడవ కూడా లేని పరిస్తుతుల్లో తన పుట్టిన రోజు వ్యాదిగ్రస్తులతో జరుపు కోవటానికి గువేరా తాపత్రయం పై ఘట్టం. రోజు తనతో ఫుట్ బాల్ ఆడే మోసెస్,తను సమాధాన పరచిన తర్వాత చికిత్స కు సహకరించిన ఎలిజాబెత్, తనతో కలిసి రోజు భోజనం చేస్తానని మంకు పట్టు పట్టే చిన్నారి మైకేల్, తన కోసం ఆహరం దాచి పెట్టి ఉంచే పదేళ్ళ  ఒలేన, వీళ్ళందర్నీ   ఒదిలి పుట్టినరోజు జరుపు కోవటం గువేరా కు ఎలా మనస్కరిస్తుంది. 
ఈ ఆఖరి మజిలి తర్వాత గువేరా తన మెడికల్ డిగ్రీ పూర్తి చేసాడు. గ్రనాడో అదే కుష్టు వ్యాది కేంద్రం లో చాల ఏళ్ళు సేవలందిస్తాడు. తమ యాత్ర గురించి ఇద్దరు మిత్రులు తమ తమ డైరీ లలో ప్రముఖం గా రాసుకున్నారు.
ఇద్దరు యువకుల యాత్ర దక్షిణ అమెరికా చరిత్ర నే ఎలా మార్చేసిందో తర్వాత ప్రపంచం తెలుసుకుంటుంది. 
చే తన జీవితం లో ప్రత్యక్షం గా పరోక్షం గా పాల్గొన్న విప్లవాలు చిలి బొలివియా క్యూబా కాంగో అయితే పరోక్షం గా ప్రపంచ ప్రజల మనోభావాలను ఎప్పటికీ ప్రభావితం చేసిన విప్లవ కారుడు.
ప్రపంచం పట్ల ఆయన దృక్పదం సమూలం గా మార్చివేసిన పై యాత్ర న్యూ యార్క్ టైమ్స్ లో మోటర్ సైకిల్ డైరీ పేరిట ప్రచురితం అయింది. అదే పేరు తో అద్భుతమైన స్పానిష్ చలన చిత్రం విడుదల అయింది.


Friday, October 28, 2011

వేయి తుపాకులు ఘర్జించనీ..


స్వాతంత్రం సిద్దించే రోజు 
మరో యుగం ముందున్నా
ఊహలు ఆశలు కాలపు కర్కసపు కౌగిలిలో నలుగుతున్నా...
అలాగే ముందుకు సాగిపో...
పోనీ..వేయి తుపాకులు ఘర్జించని..

పర పాలనలో మొద్దుబారిన మనం
శ్వాసలేని శరీరం
ఉంటె నేమి పోతేనేమి 
పోనీ..వేయి తుపాకులు ఘర్జించనీ...

నీ భూమి నీ భాష
నీ మతం నీ జనం
ఎవరో చెప్తే నీ వవుతాయా..
ఎవరి దయ తోనో మనగాలుగుతాయా...
పోనీ..వేయి తుపాకులు ఘర్జించనీ...

సహ జీవనం సౌబ్రాత్వుత్వం
కరుణ దయ  నిండిన జీవితం
యెర్ర రక్కసి కోరలచిక్కి శిధిలం అవుతుంటే
నువ్వెవరో మరిచేలా రుధిర చరిత్ర లిఖిస్తుంటే
పోనీ...వేయి తుపాకులు ఘర్జించనీ..

పరాయి మూకల తరిమేదాకా
నీ జెండా ఉవ్వెత్తున ఎగిరే దాకా
నీ భూమి నీ దయ్యేదాక 

భుద్దం శరణం గచ్చామి 
ఘర్షణ శరణం గచ్చామి
యుద్ధం శరణం గచ్చామి...
పోనీ..వేయి తుపాకులు ఘర్జించనీ..

( భారత భూమి శివారుల్లో హిమాలయ ఆవలి వైపున చెలరేగిన స్వతంత్ర పిపాసకు నా చిరు కవితా కానుక)

Saturday, September 17, 2011

ఉపవాసం...అపహాస్యం..


ఈ మద్య ఇండియా లో ఉపవాస దీక్షా కాలం నడుస్తోంది. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కుక్క పిల్ల కాదేది కవిత కనర్హం అన్న మహాకవి బతికుంటే, దీని మీద కూడా ఏమన్నా చెప్పేవాడే.పైనుండి మహాత్మా గాంధీ తెగ మురిసిపోతూ ఉండొచ్చు.పోనిలే నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒకటైన ఈ వెధవాయిలకు వంట పట్టిందని.


నిజం చెప్పాలంటే, ఈ విషయం లో కూడా మన దేశానికి ఘన చరిత్ర వుంది.మణిపూర్ లో సైనిక బలగాలను తగ్గించాలని షర్మిల పదేళ్ళ నుండి చేస్తున్న వుపవాసాలనుండి, నేడు మోడి కి వ్యతిరేకం గా ( నాకు ఇలాగే అర్ధం అయ్యింది) కాంగిరేసు వాళ్ళు చేస్తున్న ఉపవాసాల దాక అబ్బో...చెప్పాలంటే కధ శానా వుంది.కాని కొసమెరుపు ఏమి టంటే, ప్రపంచం లో మొట్టమొదటి సారి కుటుంబ నియంత్రణ పద్దతులు మొదలెట్టిన మన దేశం, మన నాయకా గ్రన్యుల వోటు రాజకీయాలలో వోట్లు పుట్టించి పుట్టించి, ( మనం నిజంగా జనం ఏనా...అనుమానమే), ఎందుకంటే మనం అయిదేల్లకోకసారే యాది కొస్తం కాబట్టి,  దాదాపు ముప్పై మూడు శాతం వోట్లు రోజు చేసేది ఉపవాస దీక్షే. మరి వాళ్ళు చేసేటిది, ఏ అవినీతి అన్తానికో, కనపడని శాంతి కోసమో కాదు.అదో నిరంతర జీవన యుద్ధం. ఎవరేమనుకున్నా, తప్పనిది తప్పించుకోలేనిది. ఇక మిగిలిన అరవై ఏడు శాతం కొస్తే, వాళ్ళూ ఉపవాసాలు గట్రా చేసేస్తారు.ఎలాగంటార, ఈ నూతన జీవన విధానాల లో తిన్నది అరగక. మరి ఎవరండి ఈ కొత్తగా ఉపవాసాలు అని బయలుదేరింది.

ఇక నేటి విషయానికొస్తే, ఉపవాసం మహా శక్తి వంతమైనది.అదే సమయంలో అతి బలహీనమైనది.అది ఒక సామాన్యుడి చేతి ఆయుధమై, ప్రభుత్వం మెడలు వంచగలదు. అల్లాగే, రాజకీయులచేతిలో రాయి అయితే, వాళ్ళ పళ్ళే రాల గొట్టగలదు.రెండో వ్యాఖ్య మీద మీకు భేదాభిప్రాయలు  ఉండవచ్చు.దీనికి మల్లి రెండు పార్వాలు ఉన్నాయి. సామాన్యుడు ఉపవాసం చెయ్యడం చాల సులభం. అంబలి తాగి గుడి వసారాలో పడుకునే వ్యక్తీ, రెండురోజులు అంబలి మానేస్తే వస్తే నష్టమేమి. అదే మన రాజకీయులు చెయ్యగలరా...
రెండో   పార్శ్వం లో వీళ్ళు  ఉపవాసాలు చేస్తారంటే నమ్మేదెవరు.మీరు నమ్మకున్నా నేను నమ్ముతాను. పశువులు మేసే గడ్డి నుండి, గనుల్లో తుప్పు పట్టిన ఇనుము దాక భోంచేసాక అరగోద్దూ..మరి ఆమాత్రం ఉపవాసం చెయ్యాల్సిందే.



ఇదే స్పూర్తి తో ఇక రాబోయే ఉపవాసాలు:
౧. ఇండియా చైనా పెట్రోలు వాడకూడదని ఒబామా.
౨. జన లోక్పాల్ బిల్ కి వ్యతిరేకంగా ప్రస్తుత కేంద్ర కాబినెట్ లో మంత్రులందరి రిలే నిరాహార దీక్ష.
౩. వీలైనంత భూమి భోన్చేసినా వ్యతిరేకిన్చాకూడదని చైనా ప్రెసిడెంట్ దీక్ష అరుణాచల్ ప్రదేశ్ లో.
౪. హుజీ లతో ఇఫ్తార్ విందు తర్వాత, పాకిస్తాన్ ప్రధాని దీక్ష వాళ్ళ దేశం లో తీవ్రవాదులు ఉన్నారన్న ప్రాపగాండా కి వ్యతిరేకం గా..
౫.రాహుల్ తర్వాత తన పేరు ప్రధాని గా ప్రకటించాలని ప్రియాంక గాంధీ కొడుకు గంట ఉపవాసం.
౬.బాంబు పేలుళ్ళ పై పదే పదే ప్రెస్సు వాళ్ళు ప్రశ్నలు అడిగినందుకు అలిగి హోం మంత్రి దీక్ష.
౭. దేశం లో వీడియొ కెమెరాలు, సెల్ ఫోన్ లలో రికార్డింగ్ సౌకర్యం  నిషేదించాలని నిత్యానంద నాయకత్వం లో బాబాలు అమ్మాలా ఉపవాసం. దీనికి వై ఎస్ ఆర్ పార్టీ నేత ఒకాయన మద్దత్తు ;)
౫. వీల్లందిరితో నాకెందుకు, బరువు తగ్గటానికి నాది ఈ పూట ఉపవాసం ;)

Tuesday, August 23, 2011

హరే రామ హరే కృష్ణ....అమెరికతలు-౮


మరో వారాంతం.మరో సుదూర ప్రయాణం .ఈ దేశం లో విశాలమైన రోడ్లు.ఒక్కోసారి ఇండియా లో ఇలాంటి రోడ్లు ఎప్పటికైనా వస్తాయా అనిపిస్తుంది.యాబై అరవై ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ ఈ రోడ్లు ఈ దేశపు రవాణా అవసరాలను ఎప్పటికీ తీర్చేసాయేమో. ఈ రోడ్లు రవాణా అవసరాలతో పాటు,మిమ్మల్ని ప్రతి వీకెండ్ అలా లాంగ్ డ్రైవ్ కెల్ల మని ప్రోత్చాహిస్తాయి.౧౨౦-౧౩౦ మైళ్ళ వేగం లో కూడా ఏమాత్రం గతుకులు లేని రోడ్డు ప్రయానికి  చాల సౌకర్యం గా ఉంటుంది.కాని గంట గంటన్నర తర్వాత ప్రయాణం విసుగని పిస్తుంది. అల్లాగే సుదూరం గా కొనసాగే రోడ్డు, పక్కనే దరీదాపు లేకుండా సాగే చెట్లు బిల్డింగులు.ఇండియాలో లా కొన్ని మైల్లకే రక రకాలు గా మారి పోయే ఇళ్ళ నిర్మాణ రీతులు ఇక్కడ కనిపించవు.అన్ని ఇల్లూ,భవన నిర్మాణాలు ఒకేలా ఉంటాయి.వాతావరణ పరిస్తితులు ఒక కారణమైతే, మరే ఆచార వ్యవహారాలను మ్యుజియం లకే పరిమితం చేసే వలస సంస్కృతీ ఇంకో కారణం కావచ్చు. 

మా మొదటి మజిలి ఇస్కాన్ టెంపుల్ అఫ్ గోల్డ్.ఇస్కాన్ భావజాల ప్రచారకులు ప్రభు పాద కోసం అమెరికా లో ఆయన నివాసం కోసం ఆయన మొదటి భక్తులు నిర్మించిన భవనం.ముప్పై నలభై ఏళ్ళ క్రితం నిర్మించ బడ్డ ఈ భవనం వారి ఆనాటి శ్రమకు మిగిలిన అవశేషం.గుమ్మటాల పైన కట్టడం లోపలా బంగారు పూతలు అత్యవసరంగా మరమ్మత్తుల అవసరాన్ని చూడగానే చెబుతాయి.ఈ రోజు మా గైడ్ చైతన్యానంద భగవాన్.ఆయన లోపల ఉన్న ప్రతి వస్తువును దాని ప్రత్యేకతను వర్ణించి చెప్పారు.భారత దేశం నుంచి వచ్చిన ఒక సాదువు ఇక్కడి వారిపైన వేసిన తనదైన ముద్ర ను ఈ అమెరికన్ ను చూస్తే తెలుస్తుంది.ఆయన దృక్పదం లో వస్తు ప్రధాన మైన ఈ లోకం లో నిజమైన దేవుని చేరే మార్గాన్ని చూపిన గురువు ప్రభుపాద.కాని నాకో విషయం అర్ధం కాలేదు.ప్రాపంచిక విషయాలలో ఏ మాత్రం రుచి లేని ఒక సాధువు ఈ బంగారపు కట్టడం లో ఉండటం ఏమిటి? ఎక్కడినుంచో వచ్చిన ఒక అనామక భారతీయునికి ఎంతో వ్యయం చేసి ఈ అమెరికన్ భక్తులు తమ స్వహస్త్రాలతో ఈ గొప్ప నిర్మాణం చేయడం ఎందుకు? కానీ ఈ ప్రశ్నలకు నాకు తొందర గానే సమాధానం దొరికింది.

టెంపుల్ అఫ్ గోల్డ్ కు అరమైలు దూరం లో కృష్ణ మందిరం.మేము వెళ్ళేటప్పటికి భాగవతం లోని ఒక ఘట్టం ప్రదర్శిస్తున్నారు.దూర్వాసుడు అర్జునుని ఇంటికి వెళ్తారు.తనతో పాటు తన అరవై వేల శిష్యులను తీసుకొని.కాని వారిని తృప్తి పరచడానికి ఇంట్లో ధాన్యం నిన్డుకున్నాయని గ్రహిస్తారు అర్జున సుభద్రలు.అప్పుడు సుభద్ర కృష్ణున్ని ప్రార్దిస్తుంది.ఈ సంకటం నుంచి బైట పడవెయమని. కృష్ణుడు ప్రత్యక్షమై,తనకు ఆకలి గా ఉన్నదనీ తినడానికి ఏమన్నా తెమ్మని అంటాడు.సుభద్ర పరిస్తితి వివరించి, ఖాళి పాత్రను చూపుతుంది.కృష్ణుడు అడగున ఉన్న ఒక్క బియ్యపు గింజను తిని, తను సంత్రుప్తడనయ్యానని అంటాడు. అదే సమయంలో నదీ స్నానానికి వెళ్ళిన దూర్వాసుడు, అతని శిష్యులు తమ ఆకలి మటుమాయం కావడం గమనిస్తారు.కృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షమై తన భక్తులను తను ఎప్పుడూ కాపాడుతానని వ్యాఖ్యానిస్తాడు.దీనితో ఆ అంకం సమాప్తమై భజన ప్రారంభమవుతుంది.

రామాయణ కాలం లో ఇచ్చిన మాట ప్రకారం, ద్వాపర కాలం లో గోపికా ప్రేమను స్వీకరించిన శ్రీ కృష్ణుని అదే గోపికా భక్తితో ప్రేమించడం ఇస్కాన్ మూల సూత్రాలలో ఒకటి.భజన జరుగుతున్న సమయం లో కొందరు భక్తులు తన్మయత్వం తో నృత్యం చేయటం చూసాను. అందం గా అలంకరించ బడ్డ విగ్రహాలను చూడటానికి దగ్గర గా వెళ్ళాను.ప్రక్కనే రక రకాల వాయిద్యాలు లయ బద్ధముగా వాయిస్తున్న భక్తులు అలౌకిక ఆనందం తో మునిగి పోవటం చూసాను. నృత్యం చేస్తున్న ఒక పూజారి ఉన్నట్టుండి ఎవరో చెప్పినట్టుగా, నన్నూ ఆ నృత్య బృందం లోకి లాగాడు.పది పదిహేను మంది భజనకు తగ్గట్టు, కాళ్ళు కదిలిస్తూ నృత్యం చేస్తున్నారు.ఆ హరే రామ హరే కృష్ణ భజన హోరులో అందమైన రాధా కృష్ణ విగ్రహాలు తప్ప వేరేమి కనపడలేదు.ఇంత మందిలో మేము మాత్రమె అలా నృత్యిస్తున్నామన్న స్పృహ లేదు.హరే రామ హరే కృష్ణ.అదే హోరు అదే జోరు.ఎవరో చూస్తారు ఏమను కుంటారో అన్న సామాన్య మైన బిడియం లేదు.హరే రామ హరే కృష్ణ.యెంత సమయం గడిచిందో తెలియదు.హరే రామ హరే కృష్ణ.ఎవరో పట్టుకు బైటికి లాగితే తప్ప నేను ఆ బృందం నుండి బైట పడలేదు.అప్పుడు గమనించాను అంతసేపు డాన్సు చేయటం వల్ల చెమట తో ముద్దైన నా షర్టు.

భక్తీ మార్గం ఒక ప్రవాహం.ఒక మత్తు.అందులో పడి పోయిన వాళ్లకు ఈ లోకం తో పని లేదు.ఎవరేమనుకున్నా సంభందం లేదు.ప్రభుపాద ఒక సన్యాసి అని ఆయనకు బంగారు మందిరాలతో సంభందం లేదని సంవత్సరాల తరబడి ఆ భవన నిర్మాతలకి     స్పురించ లేదంటే దీన్ని ఎలా వివరించగలం. అలా ఒక గొప్ప అనుభవం తో ఆ రోజు ముగిసింది.


Thursday, August 18, 2011

అన్నా నీ పోరాటం లో నేను హాజరే....


అన్నా హజారే...

ప్రపంచ మీడియా లో మార్మోగిపోతున్న హాట్ టాపిక్. దశాబ్దాలుగా అవినీతిలో మగ్గి పోతున్న సగటు భారతీయుని  ప్రతిరూపం.ఆర్.కే.లక్ష్మన్ కామన్ మాన్. ఆయన ఉపవాసం చేస్తానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ భయం తో భోజనం మానేసింది. చేష్టలుడిగి తిక్క పనులు చేసి ఛీ అనిపించుకుంది. పెద్దాయన అంటే పెరుగన్నం అంతా తినేసాడని మన గొప్ప ప్రధాని గారు  సి.వీ.రామన్ క్రికెట్ ప్లేయర్ అని, అర్మాన్ హుష్మి ఆస్ట్రోనాట్ అన్నట్టు ఏవోవో గందర గోల ప్రకటనలు చేసి ఆహా ఈయన కు నిజం గానే వయసు అయిపొయింది,ఇంకా ఇంటికెళ్ళి విశ్రాంతి తీస్కో వచ్చు అని పించుకున్నత పని చేసారు.

ఆంగ్లం లో ఈ పార్టీ పేరు అవినీతి రెండు ఒకే అక్షరం తో ప్రారంభం కావటం యాదృచ్చికం కాదు. మొత్తం పటాలం అంతా ఇప్పుడు అన్నా వెంట పడ్డారు.అవును మరి, నిజం గానే జన లోక్ పాల్ బిల్లైతే కేంద్ర కాబినెట్ లో ఎవ్వరు మిగలరని అంటే అతిశయోక్తి కాదు.అందరూ తీహారు దారి పట్టాల్సిందే. అందుకే, పిచ్చి కుక్క కరిసినట్టు ఒకరు ఈ పోరాటం వెనక అమెరికా హస్తం ఉందంటే ఇంకొకరు అంతరిక్ష వాసులే ఏదో చేస్తున్నారని వాపోతున్నారు.

నిజం చెప్పాలంటే ఎన్నికలప్పుడు ఏదో హడావుడి చేసి డబ్బు మందు ప్రవహిప చేసి గద్దెనెక్కే రాజకీయులకి, జనం నాడి ఎప్పుడు తెలియదు. అందుకే ఎలాగోలా ఈ ఉద్యమాన్ని అణచాలని చెత్త కూతలు కూసిన వాళ్ళు నేడు ఆయన కు లభిస్తున్న ప్రజాభిమానం చూసి తోక ముడుస్తున్నారు.

మరి అన్నాకు లభిస్తున్న మద్దత్తు. దీనికి ఆయన మచ్చ లేని వ్యక్తిత్వం ఒక కారణం ఐతే, ఈ కుళ్ళిన వ్యవస్థతో ముక్కు మూసుకు బతుకుతున్న జనం ఓర్పు కోల్పోవడం మరో  పెద్ద కారణం. ఇంట్లో నుంచి బైట పడ్డప్పడి నుంచి మళ్ళీ ఇల్లు చేరేవరకు ట్రాఫ్ఫిక్ పోలీసు  నుంచి ప్రభుత్వ ఆఫీసులలో అల్లావుద్దీన్ దీపం లోంచి వచ్చిన భూతం ఇంతింతై అన్నట్టు అడుగడుడున రాజ్యమేలుతున్న అవినీతి, జనం చీదరకు కారణం.ఎన్నేళ్ళు గడచినా దేశం అభివృద్ధి అలా వుంచి ఈ పరాన్న భుక్కులు స్విస్స్ బ్యాంకులలో దాచిన జనం సొమ్ము ఎన్ని రెట్లు పెరిగిందో లెక్కేలేదు. జాన బెత్తె లేని దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనం సాపాటు ఎటులేదు అని కొన్నేళ్ళు, ఎదగ డానికెన్దుకురా తొందరా అని పాడేసుకుంటూ ఎన్నో తరాలు గడిపేస్తున్నాం. మరి ఎన్నాళ్ళిలా జనం అయ్యవాల్లకు దండం పెట్టు అని బ్రతుకుతారు చెప్పండి.

ఇక ఇంటి కొస్తే ప్రతి న్యూస్ ఛానల్ లోను మనోల్ల గొప్ప పనులే. నిజం చెప్పాలంటే భారత దేశం యెంత అభ్రివ్రుద్ది చెందిందంటే, ఎనభై లక్షలతో ప్రారంభమైన మొదటి కుంభకోణం యాభై ఏళ్ళలో లక్షల కోట్లు దాటింది. ఇక్కడ మన దేశం ఎన్నో దేశాలని అధిగమించింది.

ఈ సంఘటనకు ఇంకో కోణం ఉంది. అదే మన వ్యవస్థ గొప్పతనం. శాంతి యుతం గా ఆందోళన పోరాటం చేసే హక్కు మనకు మన రాజ్యాంగం కల్పించింది. ఈ వ్యవస్థలో ఒక సామాన్య మానవుడు ప్రభుత్వాన్నే వూపెస్తున్నడంటే ఆ గొప్పతనం నిజం గా ఆ వ్యవస్థదే. ఈ హక్కును ఏ  ప్రభుత్వం మన నుంచి లాక్కోలేదు.మరి ఇలాంటి గొప్ప వ్యవస్తను ప్రతి ఐదేళ్లకు మనం అపహాస్యం చేస్తున్నాం. మందుకో, డబ్బు కో, కులం పేరుతోనో మతం మత్తు లోనో వేసే వోటు తో మనమే దీనికి తూట్లు పోడుస్తున్నాం.

ఇవన్ని సరిదిద్దు కోవడానికి మొదటి అడుగు...అన్నా ఆందోళన. ఇలాంటి ఆవకాశం చారిత్రాత్మకం.సద్వినియోగం చేసుకుంటే భారత చరిత్ర లోనూతన అద్యాయమే.అందుకే అన్నా నీ పోరాటం లో నేను హాజరే....


Thursday, July 21, 2011

క్యో కి సాస్ భి కభి టొమాటో తీ.....

కెవ్వ్...వంటిట్లో వినపడ్డ కేక విని, ఏం తగలడి పోయిందో అని పరిగెట్టా. మేడం టుస్సాడ్ బొమ్మలా మా ఆవిడ  నిలబడి ఉంది. చేతిలో అట్ల కర్ర తో రుద్రమ దేవి కత్తి  పట్టినట్టు.ఏమైంది కంగారు గా అడిగాను. నా సీరియల్ టైం అయింది. గబా గబా హాల్ లోకి పరిగెత్తింది.ఓహ్ అదా...కొంచెం ఊపిరి పీల్చుకున్నా. మా చుట్టు పక్కల పది కొంపల్లో ఏ మిస్సెస్సు  మిస్ కాని మెగా డైలీ  సీరియల్. క్యో కి సాస్ భి కభి టొమాటో తీ...ప్రారంభం అయింది.పదివేల ఎనిమిది వందల తొంభై వోక్కవ భాగం.
నిన్నటి కధ అనుకుంటాను, మల్లా చూపిస్తున్నాడు.అదుగో హీరోయిన్.నేను చుసిన నూట నాలుగో భాగం కన్నా కొంచెం వొళ్ళు చేసింది. ఎవరో అపరిచిత ( నా వరకు నాకు) వ్యక్తి తో ఈ మద్య సూపర్ డుపేర్ హిట్ అయిన మృగ వీర సినిమా పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే, నిత్యానంద కపాల మోక్షం సారీ సారీ కుండలిని కిక్ యోగ లో ఊగి పోయినట్టు గా ఊగి పోతూ డాన్సు లాటిది చేస్తుంది. ఎవడీడు?అడిగాను. హీరో అంది తల తిప్పకుండానే. మరి పోయిన సారి నేను చూసి నప్పుడు వేరే వాడు ఉన్నాడే? 
వీడు వాడి మేనత్త పేద బావ చిన్నక ముత్తవ్వ మేన మామ గారి వేలువిడిచిన కాళ్ళు తడిచిన...ఆపూ...అదేదో సినిమా లో అరిచినట్టు అరచాను. మరి పోయిన సారి ఇదే యాక్టర్ హీరోయిన్ పాత్ర లో...నా మట్టి బుర్రకి ఇవన్ని అర్ధం అయితే రోజుకి నాలుగు సీరియల్లు సూసేసే వాడిని కదా. సరేలే ...ఇన్ని వేల భాగాల తర్వాత కధ లో ఈ మాత్రం మలుపులు లేకుంటే ఏం బావుంటుంది.అయినా, ఆవిడ పర్సనల్ గొడవలు మనకెందుకు..మేనర్స్ లేకుండా..
నిన్నటి భాగం పూర్తయింది.వాణిజ్య ప్రకటనలు." నేడే ఆఖరి రోజు" గొప్ప తగ్గింపు ధరలతో,నీది బోడి ఖర్మే  సీరియల్ లో హీరోయిన్ సుబ్బ శ్రీ కట్టిన  చీర. పది కొంటె ఒకటి ఫ్రీ.ఒక్కో చీర పది వేలు మాత్రమె.నేడే వచ్చేయండి.పొమ్మనా బ్రదర్స్ .కుక్కట పల్లి,హైదరాబాద్.
కొంచెం డిన్నర్ కానిద్దూ.నా మాట విని మా ఆవిడా ఉల్లి రేకులు సీరియల్ లో తమిళ మామి తిప్పి  నట్టు నాలుగు సార్లు తల తిప్పింది.సౌండే రాలేదనుకోండి.ఎన్నడా..అని ఏదో అంటున్దనుకున్నా..కాని అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి మీరు కానివ్వండి అని మళ్ళా సౌందర్య కిరి కిరి అనే షాంపూ ప్రకటన లో మునిగి పోయింది. ఆ రోజు ఉండే సంబడవే గా..
ఫ్రిజ్ లోంచి కొంచెం డామ్బారు ( మీ ఇంట్లో మా గంటె అనే కార్యక్రమం లో చూపించబడి మా ఆవిడ చే వండ బడ్డ ద్రవ పదార్దం.) తీస్కోని టేబుల్ దగ్గర కూల బడ్డాను. మొదటి ముద్దా నోట్లో పెట్టుకున్నానో లేదో తలుపు దబ దబా బాడిన శబ్దం విని తలుపు తీశాను.పై పోర్షన్ పిన్ని గారు.పాపం ఏమైందో ఏమో కొంగు నోట్లో పెట్టుకుని ఏడుపు ఆపు కోవడానికి ప్రయత్నిస్తుంది.ఏమైందన్ నా నోట్లో మాటలు బైటి కోచ్చాయో లేదో...నన్ను తోసుకుని లోనికి పరిగెత్తింది అమ్మి అంతా అయిపోయిందే అంటూ.ఏమైందో ఏమో అనుకుంటూ..నేను హాల్ లోకి పరిగెట్టాను...
అదేనే అమ్మాయి, అనుకున్నదంతా అయి పోయిందే  తల్లి...ఆ ముడనస్తపు సచ్చినోడు బంగారం లాటి  పిల్ల ని పొట్టన పెట్టుకున్నాడే...మా అపార్ట్మెంట్ వాచ్ మాన్ మంచి మందు గాడు.అవకూడని దేమైనా అయ్యిందేమో అని నోరు తెరిచే లోగా మా ఆవిడ మొదలెట్టింది.కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటూ..ఎలా చంపాడు అయ్యో అలా జరిగిందా..నా బీ పీ డబల్ సెంచరీ దగ్గర పడింది. ఏమోనమ్మ..ఈ రోజు మొత్తం చూపించలేదు. ఆ పిల్ల నాన్న వచ్చి ఇంట్లో వెతుకు తున్నాడు. అమ్మాయి అమ్మాయి అని అరుచుకుంటూ.మద్యలో ఆపేసాడు, చింపనా బ్రదర్స్ ప్రకటన తో...నాకిప్పుడు అర్ధం అయింది.
జూ టీవి లో వచ్చే ఒక నాన్న వంద కూతుళ్ళు కొత్త ఎపిసోడ్ గురుంచి చెప్తుందని. జై మనీ టీవి లో ఈ సీరియల్ వచ్చే టప్పుడు ఆ చానెల్ లో అది తగలడుతుందన్న మాట. ఇరు దేశాలు ఒప్పందాల మీద సంతకాలు చేసుకుని మార్చు కున్నాట్టు, పిన్ని గారు మా ఆవిడ అ రోజు స్టొరీ ఆ రోజు  ఇచ్చి పుచ్చు కున్టారన్న మాట.మా ఆవిడ తేల్చేసింది, ఆ ఇదేమన్న కొత్త..పదహారు వందల యాభై ఎపిసోడ్ లోను ఇంతే, ఆ పిల్ల ఏ కూరగాయలకో వెల్లుంటుంది.మరి అన్నీ తెలిసి ఇక చూడటం ఎందుకో..
సరే అమ్మి, ఈ రోజు హీరోయిన్ ఎల్లాంటి చీర కట్టిన్దనుకున్నావ్.తప్పకుండ కంచి పట్టే ననుకో.దాని బోర్డరు,మద్యలో హ్యాండ్ వర్క్ అదిరి పోయాయే..నీకేలాగు మంచి పట్టు చీర లేదన్నావు, ఈ వారం వెల్దామేవిటి...మీ బాబాయ్ గార్ని తోడూ తీస్కుని...పొతే పోనిద్దూ చూసి వూర్కొక ఇదొకటా మళ్ళా...
లేదులే పిన్ని...బతికించింది అనుకున్నా...నిన్న మీ టీవి లో అడిగితె ఇచ్చిన గొలుసు  లో  హీరోయిన్ వేస్కున్న జుంకాలు చాల బావున్నాయ్.ఈ వీకెండ్ షాపింగ్ కెల్దామా, ఏ షాప్ లో దొరుకుతాయో..ఏమో...ఈ వీకెండ్ నాకు జ్వరం వస్తుందని ఇప్పుడే అనిపించింది.ఇదీ వరస..
సరేలే నాకెందుకు అని...నా డామ్బారు ఆస్వాదిస్తూ భోన్చేసాను.నేను హాల్ లోకి వెళ్ళేటప్పటికి కొంచెం ప్రశాంతం గా ఉంది వాతావరణం.సీరియల్ కి సీరియల్ కి మద్య వచ్చే ప్రకటన లాగ.నిజమే..నీ జన్మ కి నేనే సీరియల్ ప్రారంభం.ఇక్కడ టైటిల్స్ వచ్చే టైం కి సోనీ ఛానల్ లో ఏ రిక్షా క్యా కహనా హాయ్ అనే సీరియల్ వస్తుంది. మా ఆవిడ నాగఫణి శర్మ గారి లా ద్వందావ దానం చేస్తుంది.ఇంకా నయ్యం మా అమ్మగారు కూడా ఉన్నారు కాదు.ఇంట్లో సీత అనసూయ యుద్దమే.( అదేంటి అంటారా, వీళ్ళిద్దరికీ లింక్ లేకపోయినా ఇద్దరు ఆడాళ్ళు సీరియల్ చూస్తుంటే తన్నుకోక చస్తార మీ భ్రాంతి కాని.ఒకావిడ పేడ పందిరి అంటే ఇంకొకావిడ వివాహ బొందము అంటుంది ).
సరే సడి చేయకో ఎసి  సడి చేయబోకే, మీ టీవీ లో  రాణి సీరియల్ చూసేనే..అని పాడుకుంటూ, నా లాప్ టాప్ పట్టుకుని, నా పనిలో నేను పడి పోయాను.
తెలుగు నాట లక్షలాది ఇళ్ళలో ఈ సీరియల్ వాచింగ్ అనే సాంఘీక దురాచారానికి బలి అయిపోతున్న మగ వాళ్ళకు అశ్రు నయనాలతో.. :)
కొంచెం ఎక్కువైందా...అయిన నువ్వు చెప్పేది ఏంటోయ్ మా ఇంట్లో రోజు ఉండే తంతే ఇది అంటారా..

Tuesday, July 19, 2011

ఉపమాకోపాక్యానము...

మళ్ళా అదే..ఈ రోజు... మా అవిడ అదేదో అమృతం తెస్తున్నట్టు ఫోసు పెట్టి పళ్ళెం లో పెట్టుకోస్తున్న పదార్ధాన్ని చూసి హిచ్ కాక్ సినిమా చివ్వర్లో కనపడ్డ విలన్ ను చూసి నట్టు ఒళ్ళంతా కంపరం వేసింది .ఇంకా అదేవిటో చెప్పలేదు కదూ..అదేనండి పాల సముద్రం చిలికి నప్పుడు వచ్చిన విషాన్ని శివుడు తాగేసి, ఆ గిన్నె చివర్లో మిగిలిన అవశేశాన్ని మానవ లోకం తిక్క కుదర్చడానికి టిఫిన్ పేరు మీద మన మొహాన కొట్టిన పదార్దం.పార్వతి దేవి ఇది వండి పెడితేనే, జీవితం మీద విరక్తి పుట్టి స్మశానాల్లో    తిరిగాట్ట.ఇంకా అర్ధం కాలే, అదే మన విష్ణు మూర్తి ఇది వండి పెడి తేనే విష్ణు లోకం వదిలి భూలోకం పారి పోయ్యాట్ట. నీ పని ఇలా ఉందా అని లక్ష్మి దేవి ఆదే మల్ల పట్టుకొస్తే, ఈ సరి ఇలా కాదు అని గమ్మున తిరుపతి కొండెక్కి బొమ్మై పోయాట్ట. ఇంకా అర్ధం కాలేదా, మన బ్రంహ గారు పువ్వేక్కి ఎందుక్కుచ్చున్నారను  కున్నారు. ఈ పదార్దం పట్టుకు రావటానికి సరస్వతి దేవి నీళ్ళలో ఈది రాలేక లైట్ తీస్కుంటుంది అని.

అదే నండి..ఉప్మా. ఇవి రక రకాలు. బొంబాయి రవ్వ తో చేసే ఉప్మా మన పోస్టర్లు అంటించే పదార్దం కన్నా కొంచెం తెల్లగ ఉన్న, అది చూడగానే నాకు అదే గుర్తుకొస్తుంది. ఇక గోధుమరవ్వ ఉప్మా రోడ్డు మీదేసే కన్కరే.ఇక సేమియా ఉప్మా అని, బియ్యం రవ్వ అని, నా బొంద రవ్వ అని రకరకాలు. మద్య మద్య లో పోపు గింజలు,మాకోసమన్న కొంచెం ఎంగిలి పడు బాబు అని ఎక్కడో కాన పది ప్రాదేయ పడే జీడి పప్పు.సగం తినగానే అసలు ఈ పాడు జీవితానికి ఇది తినాలా అని పింప జేస్తుంది.దేవదాసు ఊరకే అనలేదు ఉప్మా వడలు కష్ట సుఖాలు కావడి లో కుండలే అని.  అందుకే ఉప్మా తిను వాడు ఉడతపిల్లై పుట్టును అని మన గిరీశం ఏనాడో చెప్పాడు. అసలు ఈ మద్య దొరికిన రెండో ప్రపంచ యుద్ద రహస్య పత్రాల్లో తెలిసిన విశేషాలు ఏమిటంటే, యుద్ద ఖైదిలకి, నాజి క్యాంపు గట్రాల్లో, ఇవే వొండి పెట్టె వాళ్ళట.భగవత్ గీతలో కృష్ణుడు గారు ఇంత పెద్ద సమస్య గురుంచి ఎందుకు చెప్పలేదో, చెప్తే ఎక్కడ ఇంట్లో అదే వొండి పెడతారో అని భయపడ్డాడో కాని, మా వూళ్ళో కృష్ణన్ అయ్యర్ మాత్రం బాగా అర్ధం చేస్కున్నాడు. అందుకేగా, హోటలు పెట్టాడు. ఉప్మా భాదితులంతా, ఇంట్లో ఏదో మమ అనిపించి ( లేకుంటే అదో గోల) ఆయన హోటలు ముందే వాలి పొయ్యేవాళ్ళు.మా అయ్యర్ గారి మాటల్లో చెప్పాలంటే, ప్రపంచ ఈ దినం ఆ దినం ఉన్నట్టు, ప్రపంచ ఉప్మా దినం ఉంటె యెంత బావుండు.ఆ రోజు ఆయనకి మరి పండగే.

మొన్న ఇండియా ట్రిప్ కెళ్ళి వచ్చాక,ఒబామా ఈ ఉప్మా మీద ప్రయోగాలకు పురమా ఇంచాట్ట. ఇవే ఏ ఖండార్గత క్షిపణుల్లో పెట్టి ప్రయోగిస్తే ఏమవుతుంది అని. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులకు లెవెల్ ౧౦ టార్చర్ లో భాగం గా ఇది వండి పెట్టమని కాంగ్రెస్ ఆల్రెడీ తీర్మానం చేసేసింది అని వినికిడి. మొన్న ఘుర్ఖ ల్యాండ్ ఒప్పందం లో కూడా మమతక్క వేర్పాటు వాదులను దారికి తెచ్చేందుకు వోప్మ మంత్రం వేసింది అని ఆ దెబ్బ కి దారికి వచ్చి బుర్రతిరిగి పరిస్తితి  బోదల్ గయా అని వార్త.అంగన్ వాడీల్లో ఈ ఉప్మా దెబ్బ కే సగం పిల్లలు బడి మానేశారు అని ఈరోజు స్టాటిస్టిక్స్. 
ఎవరైనా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఉప్మా నే వండి పెడుతూ,  ఇది మా ఇంట్లో అందరికి ఇదే ఇష్టం అని చెప్తున్నారా. హీ హీ హీ 
( పై టపా నిను వీడని నీడను నేనే అని ఇన్ని ఏళ్ళు గా నా వెంటపడుతున్న ఉప్మా అను పదార్దానికి ఉడతా భక్తీ గా నా సమర్పణ)

Saturday, July 9, 2011

టాల్ స్టాయ్ -కోసక్కులు

మొన్న పుస్తకాలు సర్దుతుంటే కనపడ్డది ఆ పుస్తకం.చిన్నదే  ఐన పొందికైన అట్ట.చూడగానే ఆకర్షనీయం గా, పోనిలే ఒకసారి చదువుదూ అన్నట్టు  ఉంటుంది. పైన కోసక్కులు అన్న పేరు,మధ్యలో చేతులు కట్టుకుని చదువు తావాలేదా అన్నట్టు  చూస్తున్న బరివి గడ్డం తాతయ్య.కింద ఆయన పేరు..ఇంకెవరు నా అల్ టైం ఫేవరేట్ టాల్ స్టాయ్.
 
రష్యా పుస్తకాలతో నా పరిచయం నా చిన్నప్పటిది.మా నాన్న కమ్యునిస్టు భావాలను గౌరవించేవారు.ఆ భావ జాలానికి అనుగుణంగా ఎప్పుడైనా రష్యా బుక్ exhibition వస్తే నాన్న రక రకాల పుస్తకాలు తెచ్చేవారు.వాటిలో చిన్న పిల్లల కదల పుస్తకాల నుండి, రష్యా చరిత్ర, విప్లవం మొదలైనవి కూడా ఉండేవి. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చే మా మధు బావ గాడికి నాకు ఈ పుస్తకాల దగ్గర డిష్యుం డిష్యుం జరిగేది.
 
ఇక కోసక్కుల విషయాని కొస్తే, నేను డిగ్రీ లో ఉన్నప్పుడు అనుకుంటా..ఒక బుక్ exhibition  లో చూసాను. అప్పటికి సోవిఎట్ విచ్చిన్న మై పోయింది.అలాంటి పుస్తకాలు రావటం ఆగిపోయింది.ఏదో పాత పుస్తకాల వరసలో కాన పడ్డ టాల్ స్టాయ్ తాత నన్ను పలకరించాడు.వార్ అండ్ పీసు లాంటి నవలలు రాసాడని తెలుసు కాబట్టి గబాల్న కొనేసాను.అదే నేను ఆయన పెద్ద అభిమాని అవటానికి ప్రారంభం అవుతుందని నాకు తెలియదు.
ఈ కదా ఒక చిన్న లవ్ స్టొరీ. ఒలేనిన్ అనే మన హీరో, మంచి డబ్బున్న కుటుంబం లో పుడతాడు.మాస్కో లో బాగా అప్పులు చేసి, ఎవరికి మొహం చూపించడం ఇష్టం లేక ఆ అప్పులు తీర్చడానికైన అన్నట్టు అర్మి లో చేరతాడు. కావాలని ఆ వూరు నుంచి దూరం గా పోదామని దేశ పోలిమేరల్లో పోస్టింగ్ తీసుకుంటాడు. వెళ్తూ వెళ్తూ తన దోస్తులకు చిన్న పార్టీ ఇస్తాడు.ఈ సందర్భం లో ఆ సన్నివేశాలు, బార్ లో దృశ్యాలు,బైట గుర్రబ్బండి వాడి పాట్లు,ఒలేనిన్ పూర్వ పరిచయాల్లో తలుక్కున మెరిసే మాస్కో అందగత్తెల గురించి రచయిత వర్ణన కళ్ళకు కడుతుంది.ఇక ప్రయాణం పొడుగునా అతని మనఃస్తితి,దోబూచులాడే పాత సంగతులు, రా రమ్మని పిలిచే పర్వత శ్రేణులు, విశాల మైన దేశము లో పోలి మేరలదాక సాగే ప్రయాణం చదవదగ్గవే.
 
 
ఇక అసలు కధ విషయాని కొస్తే, మన హీరో ఒక చిన్న కుగ్రామం లో పడతాడు. అక్కడి అనాగరిక జాతి పేరు కోసక్కులు. పొలిమేరలు రక్షించే సైన్యం లో వాళ్ళ జనాభా ఎక్కువే. అక్కడి జనం, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆర్దిక తారతమ్యాలు, రచయిత కళ్ళకు కట్టిస్తాడు. హీరో ఉన్న చిన్న ఇల్లు అక్కడి గ్రామ పెద్దది. ఆయన, ఆయన పెళ్ళాం మన హీరో ని చూసి ముచ్చట పడతారు. మన హీరో వాళ్ళ అమ్మాయి ని చూసి ప్రేమ లో పడతాడు. మొరటుగా, పొలాల్లో పనిచేసి ఆ పిల్ల పొగరు, బింకం మన హీరో గారికి బాగా నచ్చేస్తాయి. ఆ పల్లెటూళ్ళో మంచి కాలక్షేపం ఒరేష్కా.ఎప్పుడో సైన్యం లో పనిచేసినా ఆ ముసలాయనకు నవల పోడుగూతున తాగటం వేటాడటం తెప్ప వేరే పని ఉన్నట్టుకన పడదు. మన హీరో భావాలు పసిగట్టి, ప్రోత్సహిస్తాడు,మంచి supporting  charector అన్నమాట.ఇక హీరోఇన్ విషయానికొస్తే ఆ పిల్ల కు లూక అనేవాడి మీద మనసు. ఆ వయసుకు తగ్గ చిలిపితనం తో ఒలేనిన్ ని కొన్ని సార్లు ప్రోత్సహిస్తున్నట్టు కనపడ్డా,ఎక్కడా మనసు పడ్డట్టు అనిపించదు.
 
ఇవన్ని అర్ధం అయ్యాక మన హీరో గారు డల్ ఐపోతారు.మనసులోనే తన ప్రేమ ను దాచుకుంటాడు. ఇవన్ని మరిచి పోవటానికి మరింత తాగుడు కి , ఎరోష్క తో వేట కి బైలు దేరతాడు. కాని మద్యలో దారి తప్పుతాడు.నిర్జన మైన అడవి లో ఎటు పోవాలో తెలియని స్తితి లో తన పరిస్తితి గురించి ఆలోచిస్తాడు.
ఇక్కడ, ౨-౩ పేజీలు చాలండి, ఒక రచయిత యెంత విషయం ఉన్నవాడో చెప్పటానికి.టాల్ స్టాయ్ ఆ అడవి ని వర్ణించే విధానం,ఆ ప్రపంచం లో ఆ నిర్జనారణ్యం లో అతను యెంత చిన్న వస్తువో అన్న భావం హీరో కు స్పురిస్తుంది.తన బాధ క్షణభంగురం అని, జీవితం చాల విశాల మైన దాని, అతనికి జ్ఞానోదయం అవుతుంది.ఇలాంటి వర్ణన , ఆ రచన లో  పట్టు చదవాల్సిందే కాని వర్ణించలేము. ఆ పేజీలు నేను ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.
 
ఇక ఉపసంహారాని కొస్తే, ఒలేనిన్, ఆ ప్రాంతాన్ని ఒదిలి దూరం గా పోతాడు. అది వ్రుతిరీత్యా అని మిగిలిన పాత్రలు నమ్మినా, కేవలం హీరొయిన్ నుంచి దూరం గ వెళ్ళే ప్రయత్నం అని మనకు తెలుస్తూనే ఉంటుంది. మల్లా ప్రయాణం మొదలవుతుంది. మల్లా అవే దారులు, అవే దృశ్యాలు, అవే పర్వత శ్రేణులు...
 
జీవితం గొప్పతనం చాటి చెప్పే ఈ నవల, బాధలన్ని చిన్నవే అంటుంది. టాల్ స్టాయ్ సొంత కధ అని ముందు మాటలో ఎవరో అన్నారు. అదీ నిజమే అని పిస్తుంది. ఎందుకంటె, ఈ నవల ఒక దృశ్య కావ్యం. సొంత అనుభావాలుంటే కాని, ఎవరు అలా రాయలేరేమో....

వయ్య బాబోయ్...

లిఫ్ట్ బటన్ నొక్కాను. పైనుంచి బీప్ శబ్దం వినపడుతుంది. లిఫ్ట్ వచ్చి ఆగింది. డోర్ తీస్కోని లోపలి కెల్లాను. సెల్లార్ బటన్ నొక్కాను.లిఫ్ట్ మెల్లగా కిందకు కదులుతుంది. ౨ ఫ్ల్లోర్ కిర్రు మన్న శబ్దం. బైట బోరునకురుస్తున్న వాన ఇంకా తగ్గినట్టు లేదు. ఒక పఫ్ కొడదామని కింద బడ్డి కొట్టు దగ్గరకు వెళ్తున్నాను. బైట మసక వెలుతురు లో ఒక రూపం. అస్పష్టం గా,మనిషి రూపం. నైట్ గౌన్ వేసుకున్న అమ్మాయి.ఇప్పుడే తల స్నానం చేసిందేమో, జుట్టు తుడుచు కోవడానికి బైట కొచ్చి నట్టుంది.  ౧ ఫ్లోర్ మెల్లగా కిందకు దిగుతుంది లిఫ్ట్.బైట ఎవరో కుడి వైపు నుండి ఎడమ వైపుకు వెళ్ళారు. నేను కొంచెం ఆశ్చర్య పోయ్యా. అదే అమ్మాయి, అదేమిటి ఇందాకే కదా ౨ ఫ్లోర్ లో ఉంది అనుకున్నా. ఏమన్నా ఆట ఆడుతుందా అంటే ఇంకెవరు లేరు. ఇంత రాత్రి పూట, ఇదేమి ఆనందం. గ్రౌండ్ ఫ్లోర్ మల్ల అదే అమ్మాయి. ఈ సారి నన్నే చూస్తుంది. తనకు నాకు మద్య ౨ డోర్లు. కటకటాల మద్య లోంచి కొంచెం బయపడుతూనే చూసా. సగం మొహం జుట్టు కప్పేసింది. మంచి కలర్ ఏమో చాల బాగా కనపడింది మిగతా బాగం. కాదు కలర్ కాదు అదేదో, రోగం వచ్చి పాలి పోయి నట్టు.తెల్లగా, అదేదో రకం గా. గుంటల్లో ఉన్నకళ్ళు, నా మొహం లో ఏదో వెతుకుతున్నట్టు. చెప్పొద్దూ, కొంచెం భయం  వేసింది. మరీ దగ్గర గా ఉన్నామేమో, ఆమె వంటి నుంచి అదేదో వాసన. ఏదో శవం నుంచి వస్తున్నట్టు. ఇంతలో కిర్రు మంటూ లిఫ్ట్ ఆగింది.
వాచ్ మాన్  కుక్క ఎప్పుడు ఆ  లిఫ్ట్ పక్కనే పడుకుంటుంది. తలుపు తీసుకొని బైటకి రాగానే, నా వైపు చూసింది. ఇంత వరకు అది అలా మొరగటం నేను వినలేదు. భయానకం గా అరుస్తూ పరిగెత్తి పోయింది. అది నన్ను కాదు నా వెనక చూస్తుందని అర్ధం అయ్యింది. ఎవరో వెనక నిలబడ్డట్టు అలికిడి.సెల్లార్ లో వాన దెబ్బ కి చల్లటి గాలి వీస్తున్నా, నా నుదుటి మీద చెమట చెంప మీదకు జారటం తెలుస్తూనే ఉంది. నా గుండె వేగం గా కొట్టు కుంటుంది. మెల్లగా తల పక్కకు తిప్పి చూసా. ఎవరు లేరు కాని అదేదో నీడ కదిలి నట్టు అనిపించింది. చప్పున ముందుకు తిరిగాను. సెల్లార్ లో చల్లటి గాలి మొహాన కొట్టింది.మెల్లగా బైటకు నడుస్తున్నాను. జోరున గాలి వాన. మా మియాపూర్ లో ఈ దెబ్బకి ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు. కార్ల మద్య నుంచి నడుస్తున్నాను.దూరం లో వాచ్ మాన్ రాములు ఇల్లు. చిన్న లైట్ కనపడుతుంది. దాని పక్కనే, బడ్డి కొట్టు.
చుట్టు పక్కల వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ అవి ఇవి కొనడానికి రావటం కద్దు.నేను వెళ్ళే టప్పటికి ఎవరో అమ్మాయి ఆ కొట్టు వాడితో మాట్లాడుతోంది.ఏదో కొంటుంది కామోసు. నేను సిగరెట్టు తీస్కోని డబ్బులివ్వ బోతూ ఎధాలాపం గా అటు చూసాను. అవే కళ్ళు. కాని ముక్కు లో నుంచి ఏదో ద్రవం కారు తోంది. చిక్కగా,రక్తమే అది...అప్పుడే కరెంట్ పోయిందేమో, కొట్టువాడు వెలిగించిన కొవ్వొత్తి గాలికి రెప రెప లాడుతుంది.ఆ వెలుతురూ లోంచి ముఖం మీద పడ్డ జుట్టు లోంచి లీల గా కాన పడుతుంది ఆమె మొహం.ఇందాక చూసినప్పుడు కళ్ళు ఉన్న ప్రాంతం లో అదే ఆకారం లో  తెల్లగా, ఉన్న కనుగుడ్లు నాలో భయాన్ని రేకెత్తించాయి.ఉన్నట్టుండి ఒక కంట్లోంచి వచ్చిన పేడ పురుగు చిన్నగా పాకి ఇంకో కంట్లో కి వెళ్ళింది.
బాబోయ్..చిన్నగా నా నోట్లోంచి వచ్చిన కేక అక్కడే ఆగి పోయింది. ఇంకేమన్నా కావాలా అన్ని కొట్టు వాడి మాటలతో ఈ లోకం లోకి వచ్చాను.వాడికి డబ్బులు ఇచ్చి ఇటు చూసేంతలో మాయ మైంది.ఆ చీకట్లో కళ్ళు మిటకరించి చూసాను. దూరం గా స్మశానం లో ఏదో నీడ కదిలి పోతుంది. మా అపార్ట్మెంట్ కి స్మశానానికి మద్య ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. మనుష్యులు దూకే అవకాశం లేదు. ఆ ఆకారం అలా ఆగి, నా వైపు చూసినట్టు అనిపించింది. వన్ను లో వణుకు మొదలైంది. బాగా రాత్రి అయిందేమో, కొట్టు వాడు కొట్టు మూసేసి,బయలుదేరాడు. చుట్టు పక్కల నిర్మానుష్యం.భోరున వాన. గాలి. కరెంట్ పోవడం తో కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. generator ఉన్నవాళ్ళ అపార్ట్మెంట్ లోంచి వెలుతురూ పడుతోంది.నెమ్మది గా మెట్ల వైపు నడిచాను.
గ్రౌండ్ ఫ్లోర్ దాటాక వినిపించింది. సన్నని ఏడుపు.కర్ణ కటోరంగా.చిన్నగా ప్రారంభమై,కాసేపటి తరవాత ఆగిపోతుంది. తెరలు తెరలు గా, నిదానం గా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను.౧ ఫ్లోర్ మెట్ల మీద కుర్చుని ఉంది. ఆమె. అదే నైట్ గౌన్, కాని ఆమె కాళ్ళ దగ్గరనుంచి ఏదో కారి మెట్లమీద పారుతుంది. చిక్కటి రక్తం, అదే శవం వాసన. ఉన్నట్టుండి ధైర్యం పున్జుకున్నాను.వడి వడి గా ఆమె పక్కనుంచి పోదామని.ముంగాళ్ళ మీద కుర్చుని సన్నగా ఏడుస్తోంది. తల వొడిలో పెట్టుకోవడం తో ఏమి ముఖం కన పడట్లేదు. ఆమె కూర్చున్న మెట్టు దగ్గరకి రాగానే తలెత్తి చూసింది. అప్పుడు గమనించాను ఆమె పళ్ళు.నల్లగా గార పట్టి, నోట్లోంచి ఆకు పచ్చటి రంగులో...గబా గబా మేట్లేక్కబోయాను. ఆమె నన్ను వెంబడించింది. ఆమె ఆ మెట్ల మీద విచిత్రం గా పాకుతుంది. చేతులు ముందు మెట్ల మీద పెట్టి, పైకి పాకుతుంది చిన్న పిల్లల్లా. ఇంకో మెట్టు,  నా కాలు అందుకుంది.గట్టిగా పట్టి లాగింది.
నా పట్టు సడలింది. నేను జారి పోవడం నాకు తెలుస్తుంది.వెనక్కి చూసాను. చిత్రమైన శబ్దం చేస్తూ, ఆమె నా పైకి వస్తుంది. మెట్ల మీద పడి పోయాను. క్రమక్రమం గా ఆమె నా మీద కోస్తోంది. భయంకరమైన ఆమె మొహం నా మొహం మీదకు...

దిగ్గున లేచి కూర్చున్నాను. వళ్ళంతా తడిచి పోయింది. మంచం కింద పడి ఉన్నాను.చిన్నగా బాటిల్ అందుకుని మొత్తం తాగేశాను. ఓ...ఇదంతా కలా...బతికించావు దేవుడా...ఆనుకొని ఒకసారి గడియారం చూసాను. ౩:౦౦ AM  మల్లా చిన్నగా నిద్రకుపక్రమించాను.మా రూం వాళ్ళంతా, ఊళ్లకు వేల్లారేమో ఒక్కన్నే ఉన్నాను.

టింగ్ టింగ్ డోర్ బెల్.ఈ టైం లో ఎవరు...కొంపదీసి...బయ పడుతూనే,కీ హోల్ లోంచి చూసాను. అవే కళ్ళు...అదే మొహం...ఆశ గా కీ హోల్ ని చూస్తుంది...
(ఇప్పుడే చుసిన హారర్ సినిమా కి నా పైత్యం జోడించి ;) )

లంచా తురానాం న భయం న లజ్జ....

నవంబర్ 21 ,2016.
౧౨ లాలూచి పథ్,కొత్త ఢిల్లీ.
సాముహిక లంచం క్రీడల ప్రారంభోత్సవం  నేడు..
Blocked Games Road.. No Entry… పక్కనే సిగ్న్ బోర్డ్ వేలాడుతుంది..ఆ రోడ్ కి.. సరిగ్గా క్రీడా ప్రాంగణానికి వెళ్ళాలంటే వేరే రోడ్ లో వెళ్ళాలి.కొంచెం దూరం అవుతుంది  ఆ దారి.ముందు నేను అదే దారి లో వెళ్దాం అనుకుంటే, నా దోస్త్ ఎవరో చెప్తే ఈ దారిని వచ్చాను. కాని, రోడ్ బ్లాక్ బోర్డ్ ఉంది ...అప్పుడు చూద్దును కదా...ఈ రోడ్ లో బ్రంహాండ మైన రద్దీ..అందరూ ఇదే దారిలో క్రీడా ప్రాంగణానికి వెళ్తునారు. సరే నేను నా కార్ ని ఇదే రోడ్ లో కి తిప్పాను. బోర్డ్ తీయ్యటం మర్చి పోయారేమో...రోడ్ చివరలో అర్దమైంది అసలు సంగతి. అక్కడి ట్రాఫిక్ పోలీసు చక్కగా ప్రతి వాహనాన్ని ఆపి, పదో పరకో జేబులో వేస్కొని పంపిస్తున్నాడు. ఈ బోర్డ్ అతిక్రమించి నందుకేమో..పొద్దున్నే పెనాల్టి ఏంట్రా బాబు అనుకుంటూ నేను అతని పక్కనే ఆపి విండోస్ దించాను.గుట్కా నమిలి నమిలి, అదేదో రంగులో మారి పోయిన పళ్లన్నీ,నేనేదో డెంటిస్ట్ అన్నట్టు చూపిస్తూ..సౌ రూపాయే అన్నాడు..నేనిచ్చిన నోటు జేబులో వేస్కుని పోమ్మన్నట్టు చెయ్యి ఊపాడు. రసీదు ఇస్తాడేమో అని వెయిట్ చేస్తున్న నాకు అప్పుడర్దమైంది. అయ్యవారు ఇక్కడ మంచి లాభ సాటి వ్యాపారం నడుపుతున్నారని.
సరే కార్ పార్క్ చేసి మెయిన్ గేటు దగ్గరకు వచ్చాను.టికెట్స్ సొల్ద్ ఆఫ్..బోర్డ్ నన్ను వెక్కిరించింది. అయ్యో ఎలాగా అని చూస్తుంటే, వాడెవడో టికెట్ల కట్ట పట్టుకుని గోడ వార గనిలబడి ఉండటం.జనం వాడి మీద పడి, కొనటం చూసాను. దగ్గర కెళ్ళి అడిగాను. టికెట్టు  ౫౦౦౦. బేరం మొదలెట్టాను..వాడు నేనేదో వాడి జేబు కొట్టేసినట్టు మొహం పెట్టి, మేనేజర్ సాబ్ కోభి ఇసీమే ఖిలాన హాయ్ సాబ్..అన్నాడు.ఆహా..ఇది కదా లంచావతారం అంటే. టికెట్లు అన్ని బ్లాక్ లోనే అమ్ముతున్నారు.అందులో అందరు పదో పరకో పుచ్చు కుంటున్నారు. సరేలే అని ఆ డబ్బు వాడి చేతిలో కుక్కి ఎంట్రన్సు దగ్గరకి వచ్చాను. టికెట్టు తీస్కున్న వాడు అదేదో రహస్యం చెప్తున్నట్టు వంగి, ఆగే భైటన హై క్యా..౫౦౦ లగేగా అన్నాడు. ఓహో ఈ సౌలభ్యం కూడా ఉందా నాయనా..సరే..ఆ ౫౦౦ వాడి చేతిలో పెట్టాను. పక్కనే ఉన్న కుర్రాడిని నాతొ పాటు పంపాడు.నేను కొన్న టికెట్టు కన్నా ౧౦ లైన్లు ముందు ఒక సీట్ లో కూర్చో బెట్టాడు వాడు. ఆహ..ఇక్కడినుంచి బాగా కానీ పిస్తుంది. ఇప్పుడే మహా మహులంతా వేదిక నేక్కారు. ప్రదాని, రాష్ట్రపతి, వగైరా వగైరా...అయ్యవారు పెద్ద స్పీచ్ ఇవ్వడం ప్రారంబించారు.ఈ క్రీడలు ఇక్కడ జరపటం గొప్ప విషయం అని, ఏంటో కష్టపడి మన క్రీడా మంత్రి అంతర్జాతీయ మద్దత్తు తో వీటిని ఇక్కడకు తీస్కోచారని. అదేంటి, పొద్దున్న విన్న సి.యెన్.యెన్ లో అలా చెప్పారు. మనోళ్ళు అన్ని దేశాల ప్రతినిదుల్ని డబ్బుతో కొనేసి, ఈ క్రీడలను సంపాదించారని.పెద్దాయన చెప్తుంటే ఇదే నిజం అయి వుంటుంది. వెదవలు , మన గొప్పతనం చూసి వోర్వలేదు విదేశి మీడియా
అదేంటి, పెద్దాయన అలా వొరిగి పోతున్నాడు. అప్పుడు గమనించాను.ఒరిగి పోతుంది పెద్దాయన కాదు. సభ ప్రాంగణం అని.కుప్పకూలి పోయింది. కూర్చున్న వాళ్ళు కూర్చునాట్లే దిగబడి పోయారు. అటు ఇటు పరిగెత్తు తున్న సెక్యూరిటీ వాళ్ళు, అంతా గందర గోళం. మొత్తానికి జంబో సైజు రాజకీయ నాయకులని పైకి లేపడం సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ కూడా కావటం లేదు. ౧/౨ గంట నడిచిన తర్వాత,అమ్బులన్సు లో అందరిని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇంతలో ఆయన సైజు కి తగ్గట్టు జనం ముద్దు గా పిల్చుకునే ఖడ్గమృగం నాయకుడు ప్రారంబోత్సవం అయింది అనిపించాడు. లేట్ ది గేమ్స్ స్టార్ట్..
మొదటి పోటీ..౧౦౦ మీటర్ల పరుగు పందెం. మనోళ్ళు ఎప్పుడు విదేశాల్లో జరిగినప్పుడు గెలవని పందెం. ఈ సారి మన దేశం నిర్వహిస్తుందని ఈ కంపు గొట్టే క్రీడా గ్రామాని కి మేము రాము అని కొందరు,శాంతి బద్రతల సమస్య ఉందని మరి కొందరు మానేయడం తో ఈ సారైనా మనకు పతకం వస్తుందేమో. ప్రారంభం అయ్యింది. ౫౦ మీటర్లు మనోడు ఆ చుట్టూ పక్కల కనిపించాలా...కాని అదేంటో సినిమాలో హీరో పరిగెత్తు తుంటే మిగత వాళ్ళు మెల్లగా పరిగెత్తి నట్టు మనోడు పరిగెత్తు తున్నాడు అనేకంటే మిగతా వాళ్ళు మెల్లగా పరిగెత్తు తున్నారని పించింది. మొతానికి ఏది ఏమైనా మనోడు వెంట్రుక వాసి లో గెలుపొందాడు అండి. ఆహ..అప్పుడు చూడాలి..జనం కుర్చిలలో నుండి లేచి కుప్పి గంతులు గోలా..
అదీ ఇదీ కలిపి మద్యాన్నం ప్రాంతానికి జరిగిన అన్ని పోటీలలో మనోల్లదే గెలుపు.. అదేంటి చెప్మా..మిగతా దేశాల్లో పోటీలు జరిగినపుడు..గొప్పగా రాణించే విదేశీ క్రీడాకారులు మన దేశం లో యెందుకిలా..మన వాతావరణం సరి పడి ఉండదు..అంతే అయి వుంటుంది..
మిగతా స్టేడియం లలో మనోళ్ళు ఎలా ఆడుతున్నారో విందాం అని నా మొబైల్ లో రేడియో ఆన్ చేశా..సిగ్నల్ వెతుకుతుంటే వినపడ్డది బీ.బీ.సి. సరే మన గొప్పతనం వీల్లేమి చెప్పుకుంటూన్నారో విందాం అని వింటున్నా..అదేంటి. ౧౪ లంచావతారం రోడ్ లో ఉన్న మేహుల్ గాంధీ ఎనిమిదో నెల   కడుపులో ఉన్న యువనేత భావి భారత ప్రదాని  జీబెల్ గాంధీ పేరు పెట్టిన స్టేడియం లో రన్నింగ్ రేస్ మైదానం లో నీళ్ళు ఉండటం తో ౨ క్రీడాకారులు జారి పడ్డారని, నాసిరకం పోల్ విరగటం తో జారి పడ్డ పోల్వాల్ట్  క్రీడాకారుడి నడుము కూడా విరిగిందని..అవాకులు చెవాకులు...ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే..మన గొప్ప తనం చూసి కళ్ళలో నిప్పులు పోస్కుంటారు.
అంతలో డబ  డబ అని శబ్దం..అదేంటి మబ్బు లేకుండా ఉరుములు...పైకి చూసా...స్టేడియం కప్పు ఒక వైపుకు ఒరుగుతుంది.అబ్బే..అదేదో సెక్యూరిటీ చెక్ అయివుంటుంది.లేక పొతే మొన్న కట్టింది అప్పుడే కూల్తుందా...ఇంతలో నేన్ను కూర్చున్న వైపు కూడా శబ్దం వినిపించింది.పైకి చూద్దును కదా..
కళ్ళు తెరిచే టప్పటికి ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడున్నాను నేను...ఏదో నొప్పి గా ఉండటం తో తడుము కొని చుస్కున్న..తలకు తల పాగా చుట్టినట్టు...అబ్బో ఇదేంటి...హాస్పిటల్ లో ఉన్నా  అని అర్ధం అయ్యింది...మెల్లగా లేచి రూం లోంచి బైటకు వచ్చా..
రిసెప్షన్ లో జనం అటు ఇటు పరిగెత్తు తున్నారు. మా ఆయన ఎక్కడ అని ఒకావిడ..మా అన్నగారు అని ఒకాయన...చాల మంది కి దెబ్బలు తగిలి నట్టున్నాయి.ఎవర్ని కదిలించిన అసలేం జరిగిందో ఎవరు చెప్పట్లే. ఈ హడావుడి నుంచి దూరం గా లాన్ లో కూర్చున్నాను. పేపర్ ఒకటి కొని అసలేమైందో అన్న ఉత్సుకత తో చదవటం మొదలెట్టా..నిన్న స్టేడియం కూలటం వాళ్ళ ౫౦౦ వందల మంది చని పొయ్యారని..౧౦౦౦౦ మంది గాయ పడ్డారని వార్త...నాసిరకం నిర్మాణాల వల్లే ఇదంతా జరిగిందని విదేశి మీడియా బోగట్ట..ఇదంతా మాములే అని ముక్య మంత్రి వివరణ. స్పోర్ట్స్ పేజిలో మనోళ్ళు ౧౦౦ కి ౯౦ పతకాలు గెలిచారని వార్త..కిందనే విదేశి పత్రికల శూల శోధన...విదేశీ క్రీదాకారులన్దర్నీ మన అధికారులు కోనేసారని..అందుకే మనకు ఇన్ని పతకాల పంట అని...
ఛీ ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే అని అన్ని పార్టీల సంయుక్త ప్రకటన...దీన్ని  బలపరుస్తూ..రాజధాని లో అక్కడక్కడా విదేశి మీడియా ఆఫీసుల మీద జోమ్రాస్ పార్టీ దాడులు...తిక్క కుదరాలి సన్నాసులకి....ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చిన పదో పరకో పుచ్చుకొని స్వదేశి మీడియా లాగ  వాళ్ళు చెప్పింది చెప్పక..దేశాన్ని వుద్దరిద్దాం అని బయలు దేరితే ఇలాగే అవుతుంది.
వారం  రోజుల తర్వాత ఇంకో వార్తా చదివాను పేపర్లో. ముగింపు ఉత్సవాలలో ఆకాశం నుంచి పూలు చల్లుతున్న మొన్ననే క్రుష్య దేశం నుంచి  కొన్నబుగ్-౪౨౦ విమానం  పక్కనే ఉన్న పొలాల్లో కూలి పోయింది. పోనీలెండి మల్ల ఇంకో కాంట్రాక్టు పిలవచ్చు..మల్లా దానిపైన మన నీటి ఏనుగు  నాయకుడు ఇంతో అంతో ఎనకేసుకోవచ్చు...సర్వే జనా సుఖినో భవంతు..

మా ఇంట్లో పావురాలు

 ఒక రోజు ఉదయం.బాల్కనీ లో ఏదో శబ్దం అయినట్టుంటే వెళ్లి చూసాను. పావురం ఒకటి మా బాల్కనీ లో గూడు కడుతుంది.ఒక పుల్ల అక్కడ పెట్టి మళ్ళీ తుర్రున యెగిరి పోయింది.మల్ల కొంచెం సేపటికి ఎక్కడి నుంచో ఇంకో పుల్ల పట్టు కొచ్చింది.వాటినన్నిటిని, పద్దతి గా అమరుస్తుంది. మద్య మద్య లో నీకేం పని ఇక్కడ అన్నట్టు నన్నో చూపు చూస్తుంది.ఆఫీసు కి టైం కావటం తో దాన్ని అల్లా వదిలి బైటి కొచ్చాను. నాకు రొజూ బాల్కానీ లో కూర్చొని పేపర్ చదవటం అలవాటు కావటం వల్ల రొజూ ఆ పావురాల జంటని పరిశీలిస్తూ వచ్చాను.౨-౩ రోజుల తర్వాత గూడు చక్కగా అమరింది. ఆడ పావురం రెండు చిన్ని చిన్ని గుడ్లు పెట్టి,పొందిక గా వాటిపై కూర్చుంది.ఆహారం వ్యవహారం మగ పావురం పని ఏమో, అది ఇక్కడా అక్కడా తిరుగుతుందేమో.హత విధీ, పావురాల్లో కూడా ఇదే తంతా అనిపించింది. :)
రెండు పావురాలు ఎంతో అందం గా ఉన్నాయి కదా అనుకుంటూ ఎందుకో నేల వైపు చూసాను.రామ,రామ మా ఇంటి వోనరు ఆ దృశ్యం చూసి వుంటే, బాల్కనీ చువ్వలు వంచుకుని మూడో అంతస్తు నుంచి దూకేస్తాడేమో అనిపించింది. ఎంతో ముచ్చట పడి వేయించుకున్న తెల్లని టైల్సు మీద, పావురాలు బాత్రూం ఇత్యాదివి కట్టుకున్నట్టు లేదు తమ ఇంట్లో.పాపం కదా కొత్త జంట అని నేనే కొంచెం శ్రమదానం చేసి శుబ్రం చేసాను.
ఇలా రొజూ నడిచి పోతుంది. కొన్ని రోజుల తర్వాత, పావురాలు బాల్కనీ మొత్తం మాదే అన్నట్టు ప్రవర్తించడం మొదలెట్టాయి. ఏదో ఒక మూల పేపర్ చదువుకుంటున్న నన్ను మొదట్లో గుడ్లు ఎట్టు కేల్లెవాడిలా చూసేది ఆడ పావురం. వాటి భాష లో కొంచెం ఘాటు గానే తిడుతున్నట్టు అప్పుడప్పుడు అనుమానం కలిగేది.కొన్నాళ్ళ తర్వాత, బాల్కనీ డోర్ తియ్యం గాల్నే మగపావురం థిస్ ల్యాండ్ బెలొంగ్స్ టూ అస్ అన్నట్టు మీద మీద కోచ్చేది.మా స్నేహితుడోకాయన చల్ల గాలి కోసం తలుపు తీసాడో లేదో ఆయన మొహం మీద పికాసో బొమ్మ వేసినంత పని చేసింది. అదే చివరాఖరు సారి, మల్ల ఆ బాల్కనీ తలుపు తియ్యలేదు కొన్ని రోజులు. ల్యాండ్ వోనెర్ మీద ఆక్రమణ దారుని దురాక్రమణ లా పావురాలు మా బాల్కనీ ఆక్రమించేశాయి. నేనే అప్పుడప్పుడు, తలుపు కొంచెం తీసి దొంగ లా చూస్తూ ఉండేవాడిని.మగ పావురం బైటి కేల్లిందని నిర్దారించు కున్నాక, అప్పుడప్పుడు శుబ్రత పరిశుబ్రత కార్యక్రమం చేపట్టేవాడిని.

ఒక రోజు ఉదయం, జాగింగ్ కెళ్ళి వచ్చేటప్పటికి పావురాల కూతల్లో తేడ వినిపించింది. రెండు కన్నా ఎక్కువే ఉన్నాయి, పొద్దున్నే కిట్టి పార్టీ ఏమన్నా పెట్టాయ అనుకుంటూ,తలుపు సందు లోంచి తొంగి చూసాను.చిన్ని చిన్ని పావురాలు రెండు వాళ్ల అమ్మ దగ్గర ఏదో తింటూ అరుస్తున్నాయి. ఒకటి నల్లది ఒకటి కొంచెం తెల్లది. ఆడది మొగది అనాలేమో.యెంత ముద్దు గా ఉన్నాయో, ఒకసారి ఎత్తు కుందాం అని బైట పడ్డ అడుగు, తెలుగు సినిమా చివర్లో హీరో విలన్ ని చూసి నట్టు మగ పావురం చూస్తుండటం తో ఆగిపోయింది. ఇప్పుడు ఈ దిశ్కుం దిశ్కుం ఎందుకు లే అని మల్ల లోపలి కెల్లాను, తలుపు మెల్లగా మూసి.

చెప్పద్దూ, భలే ఆనందం వేసింది. బాల్కనీ ఆక్రమించినందుకు, మీదు మిక్కిలి కంపు చేసినందుకు, దాన్ని శుబ్రం చేసినందుకు తెగ తిట్టుకుంటూ ఉండే వాడిని. అదంతా  బుజ్జి  తెల్ల పావురాన్ని చూసే టప్పటికి హుష్ కాకి సారీ హుష్ పావురం అని యెగిరి పోయింది. ఇంకో ఆనందం ఏమిటి అంటే, ఎలాగు పిల్లలు పుట్టాయి కదా, బాల్కనీ ఖాళి చేస్తాయి లే అని.కొన్ని రోజులు ఓపిక పడదాం చిన్న పిల్లలు ఎలా వెళ్తాయి అని నన్ను నేను సమర్దిన్చుకున్నాను. సరే, కొన్నాళ్ళు ఇలానే గడుపుదాం అని. కాని, రాను రాను పరిస్తితి అద్వాన్నం అయింది.పెద్ద చిన్న పని కట్టుకుని బాల్కనీ అంతా ఆక్రమించి ఇంకెందుకు లెండి...కడుపు చించు కుంటే ఫాంట్ మీద పడుతుంది.

మా బుజ్జి పావురాలు పెద్దవి అయ్యాయి.కొంచెం కొంచెం ఎగరటం ప్రాక్టిస్ చేస్తున్నాయి.ఆహా,కొంచెం ఎగరటం, మల్లా బాల్కనీ లోకి రావటం.తల్లి కావాలని దాన్ని నెట్టేస్తుంది.చిన్న పిల్లలేమో భయం భయం గా రెక్కలు ఆడించి మల్లా వెనక్కోచ్చేస్తున్నాయి. నా అభిమాన తెల్ల పావురం, మాంచి దూరం ఎగురుతుంది. శభాష్ అనుకున్నాను.అలా యెగిరి యెగిరి ఎల్లి పోండి, పిల్లల్లారా.మళ్ళా రాకండి అని అత్మాశరతుడు లోపలెక్కడో అరుస్తున్నాడు.తదాస్తు.
ప్రాజెక్ట్ పని మీద ౩ వారాలు బెంగుళూరు వెళ్ళటంతో, మా పావురాలేమైనవో తెలుసుకోలేక పోయాను.తిరిగి వచ్చి తలుపుతీస్తుంటే అనిపించింది. ఆహా, ఈ పాటికి బాల్కనీ ఖాలీ అయిపోయి ఉంటుంది కదా.మల్లా ఒక .౫ గంట మనది కాదు అనుకుంటే, హ్యాపీ గా బాల్కనీ లో కాలు మీద కాలేసుకుని, నోట్లో వేలేసుకుని, మాంచి కాఫీ తాగుతూ, పేపర్ చదువుకోవచ్చు అనుకున్నాను.అదే మూడ్ లో బాల్కనీ తలుపు తీసాను.బాబోయ్, పెద్ద పావురం ఒకటి నా ముహం మీద మాంచి బొమ్మ గీస్తాను అని బయలుదేరింది. మనకి మాంచి ప్రాక్టిస్ కదా, కబుక్కున తపుపేసి,కాసేపు దాన్నే అనుకుని నిలబడ్డాను.రేప్ సీన్ లో హీరోయిన్ విలన్ ని బైటకి తోసి, తలుపు గట్టి గా పట్టుకున్నట్టు. ఇదెలా జరిగింది అని చిన్న విచారణ కమిటి వేసాను.దాంట్లో ప్రదాన investigator  నుంచి బంట్రోతు దాక అన్ని నేనే అనుకోండి. కొండను తవ్వి, పండి కొక్కును పట్టి నట్టు, తేలింది ఏమయ్య అంటే,మా పావురాలు ఖాలీ చేసి వెళ్లి పోయాయి. సదరు ప్రస్తుత జంట సరి కొత్తది.అవి పోగానే, ఖాలీ నే కదా అని ఇవి ఆక్రమిన్చాయన్న మాట..అదీ సంగతి. నేను మల్లి చీపురు చాట పట్టుకుని రెడీ ఐపోయాను, తలుపు ఖాలీ లోంచి తొంగి చూడటానికి :(

బెంగుళూరు బస్సు స్టాండ్

బెంగళూరు బస్సు స్టాండ్ ఏమీ మారలేదు. ౫ ఏళ్ళు అయిందేమో ఇక్కడికి వచ్చి. ఏ మాత్రం తేడ లేదు. అవే ప్లాట్ ఫోరమ్స్,అదే ఆశుబ్రత,అదేదో పెద్ద చెత్త డబ్బా లా ఫీల్ అయి పోయి చెత్త వేసే చెత్త జనం, ఆశుబ్రత వల్ల భరించలేని దుర్ఘందం. స్కూల్ వదిలేక నలు వైపులా పరిగెత్తే పిల్లల్లాగా అడ్డదిడ్డంగా పొయ్యే బస్సులు.ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా మారనిది అదే అలసత్వం,అదే నిరాసక్తత.
ప్రభుత్వాల మాట పక్కన పెడితే మన జనం ౧౦ ఆకులు ఎక్కువే చదివారు. ఎంతైనా ఎడా ప్రజా తదా రాజానే కదా.
ఒకచోట స్తిమితంగా కూర్చోడానికే చాల ఇబ్బంది పడాల్సివచ్చింది.నన్ను తోసుకుంటూ వెళ్ళిన ఒకాయన, వెనక్కితిరిగి అదేదో భాషలో, ఇంకేదో అని విస విసా వెళ్లి పోయాడు, అది సారీ కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.ఇంకో మహానుభావుని నోటి పళ్ళ మద్య భాగం నుండి, విచిత్రమైన శబ్దం చేస్తూ బయల్పడిన ఘుట్కా ఫౌంటైన్ నా కాళ్ళను కొంచెం మిస్  చేసి నేల నిండా పరుచుకుంది. కొంచెం సీరియస్ గానే తలెత్తి చూసాను. కొంచెంలో మిస్ అన్న ఫీలింగ్ కనపడింది ఆయన గారి మోహంలో.ఇక చెత్త తీస్కేల్లే బండి నుండి కారిన జల పదార్ధం మేకేన్నాసు గోల్డ్ కి దారి చూపే మ్యాప్ గీచినట్లు చాల దూరం పారింది.నా పక్కన కూర్చున్న భారి ఫ్యామిలీ ఫలహారం చెయ్యడం మొదలెట్టారు..ఇంకా చూస్కోండి నాయనా, ఇక చుట్టూ పక్కల ఎటు చూసిన తిని పారేసిన స్నాక్ పాకెట్లు,తాగి పారేసిన కాఫీ కప్పులు,అక్కడే ఇంకో అరగంట వుంటే,ఆ చెత్త సముద్రంలో మునిగి పోతానన్న చెత్త ఫీలింగ్ రావటంతో,అతి కష్టం మీద దొరికిన సీట్ ను వదిలి, అయిష్టం గా నైనా మెకన్నాస్ గోల్డ్ మ్యాప్ అనుసరిన్చాల్సివచ్చింది.తపక్ మని నెత్తిమీద ఏదో పడటం తో తలెత్తి చూసాను.పై కప్పు కారుతుంది. ఆ ద్రవ పదార్ధం రసాయన విశ్లేషణ మానేసి, శుబ్రం చేస్కో టానికి toilet  లో దూరాను. అక్కడ చూడాల్సిందే, అదేదో చిరంజీవి సినిమా మొదటి ఆటాకు ఉన్నట్టు ఉన్నారు జనం. ఇక లోపల పరిస్తితి చెప్పుకోదగిందే.నేలంతా రక రకాల సువాసనలతో తడి తడి గా ఉంది.అదేవిటో ఇదేవిటో అంటే ఈ బ్లాగ్ గబ్బు కొడుతుందని, గబా గబా పని ముగించుకొని బైటకు వచ్చాను.
ఇక ఇక్కడి ప్రభుత్వ ఘనత. కొన్ని ప్లాట్ ఫోరమ్స్ కి చెత్త డబ్బాలే లేవు. అవి ఉంటేనే,మనోళ్ళు వాటిని వాడటం బహు అరుదు. ఇక లేని చోట్ల పరిస్తితి, అంటా నేను చెప్తే మీరేం చేస్తారు..ఊహించండి.ఉన్న చోట, బాగా బలిసిన రాజకీయ నాయకుని స్విస్స్ బ్యాంకు ఎకౌంటు లా పొంగి పొర్లుతున్నాయి. అశోకుని కాలం నుండి ఎవరూ శుబ్రం చేసినట్టులేదు.మరి ౩ తుపాకులు,౬ బాంబులు అని మన తీవ్రవాద మిత్రులు చెలరేగి పోతున్న కాలం లో ఈ బస్టాండ్ లో భద్రతా ఎలా ఉందయ్యా అంటే,బస్టాండ్ బైట మీకో మెటల్ detector కాన పడుతుంది.కాని దాంట్లోంచి రావటం పోవటం మీ ఇష్టం అనుకోండి.ఎందుకంటె, అంతకుముందు ఉన్న పెద్ద ఎంట్రీ లో ఇదొక చిన్న భాగం మాత్రమె.పక్కనే కూర్చున్న పోలీసాయన కు దీనికన్నా పేపర్ మీదే మక్కువ ఎక్కువున్నట్టుంది. ఆయన లోకం లో ఆయన ఉన్నాడు.హలప్ప మసాల వార్త చదూతున్నాదేమో ఈ లోకం లో మాత్రం లేదు.నాకిక బస్టాండ్ లో ఇంకో పోలీసాయన కనబల్లా.
చెప్పాలంటే చాల ఉంది చెన్న కేశవా అని ఈ బస్టాండ్ ఘనత వర్ణించడానికి ఈ పోస్ట్ సరిపోదని డిసైడ్ అవుతుంటే, నా బస్సు వచ్చింది,ఇక ఉంటా మరి.మీరు కూడా ఎందుకు ఈ చెత్త బ్లాగ్ లో..పని చూస్కోండి.