Sunday, December 25, 2011

ఎవరో ఒకరు..ఎపుడోకపుడు...నడవరా ముందుగా..

       నేడు దేశం లో ప్రభుత్వమే   ఉందా లేదా అని జనాలకు అనుమానం రావటంలో తప్పు లేదు.ఎటు చూసిన అవినీతి, బంధు   ప్రీతి, కోట్ల కొలది విదేశి బాంకుల్లో మురుగుతున్న ప్రజాధనం. దేశంలో జరిగే వాటికే లెక్క లేదు, విదేశాల్లో ఎవరికెంత ఉందొ చెప్పలేం అని చేతులెత్తేసిన ప్రభుత్వం. అన్నిటికీ మించి అనంత కోటి అవినీతికి శతకోటి ఉపాయాలన్నట్టు పేట్రేగిపోతున్న  ప్రజా ప్రతినిధులు. చట్ట సభలు చట్టు బండలై, ఏలే వారి కొమ్ముకాస్తున్న వైనం.
     ఘనత వహించిన పార్లమెంటు,ఇతర చట్ట సభలు చేసే చట్టాలు దేశం కోసం కాదు, రాజకీయుల కోసమే అనేది నేడు నడుస్తున్న చరిత్ర..ఈ వ్యాఖ్యకు   లోక్పాల్ బిల్లు పై పార్లమెంట్లో నడుస్తున్న చర్చ.ఇపుడు నడుస్తున్న చర్చ చూస్తుంటే, ఈ బిల్లు ఎప్పటికి వెలుగు చూసేటట్టు లేదు. ఏకా భిప్రాయం మాట అటుంచి, ఎలాగోలా దీన్ని ఆపాలనే ప్రఘాడ ఆసక్తి ప్రస్పుటం గా తెలుస్తుంది.
        ఒకవేళ ఈ బిల్లు ఏదో రూపంలో ఆమోదం పొందితే, తమ కిందకు ఎక్కడ  నీల్లోస్తాయో అని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాగం అందుకుంటుంది. అదుగో పులి అంటే ఇదుగో పిల్ల అన్నట్టు, రోజుకింత ముద్ద తిని శివాలయం వసారాలో పడుకొనే ముసలాయన గురుంచి కూడా అవాకులు చెవాకులు పేలారు. అన్నా నిజాయితీ ని జనం శంకిస్తే, బిల్లును పక్కకు తోసి చేతులు దులుపుకోవాలనే దుగ్ధలో ఇదో భాగం  అని వినగానే అర్ధం అవుతుంది.ఆయన సంఘ్ పరివార్ దోస్తు అని ఒకరంటే, విదేశి శక్తులేవో ఈయన ఉద్యమం వెనకాల ఉంది నడిపిస్తున్నాయని ఇంకొకరు వ్రాక్కిచ్చారు.
                  ఇక రిజర్వేషన్ల సంగతి.నేటి రాజకీయం దుస్తితికి నిదర్శనం.కుల మత రాజకీయాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఈ వ్యవస్థలో ఇది ఒక తురుపు ముక్క. దశాబ్దాలుగా మహిళా బిల్లు ఆమోదం పొందక పోవడానికి ఇదే పెద్ద అడ్దంకి.ఎన్ని సార్లు ప్రయోగించినా మల్ల మళ్ళా వాడుకోవడానికి వీలైన భేషైన ఆయుధం.ఈ బిల్లు ముందుకు నడవకుండా ముందు కాళ్ళ భందం.
                 చర్చలో పదే పదే మన నాయకులు ప్రస్తావించిన మరో సమస్య, ఒక వ్యక్తీ ఉన్నతమైన చట్ట సభలను ఆదేశించే స్తాయికి ఎదిగారని, అది ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు అనిన్నూ.అయ్యా..ఆయనే ఉంటె మంగలాయన ఎందుకని, మీరు చక్కగా ఉంటె కొత్తదేవుల్లెందుకు. ఉన్న వ్యవస్థ గొప్పగా పనిచేస్తుంటే, కొత్త వ్యవస్తలు బిల్లులు ఎందుకు. అమోఘమని మనం కీర్తించుకునే రాజ్యాంగానికి ఇన్ని సవరణలు ఎందుకు. అవన్నీ ఎవరో ఒకరు ప్రతిపాదిస్తే, చర్చించి మార్చినవేగా..అయినా, ఆయన చేస్తున్న ఆందోళనలన్ని శాంతియుతమేగా..సంతియుతంగా విరోధం తెలపటం, ఆందోళన చేయటం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మరి దీనిమీద వీళ్ళకంత భయం ఎందుకో.
                 కాలానుగునంగా మన చట్టాలు మార్చుకోవటం సవరించు కోవటం తప్పు కాదు. వీరి భాషలోనే చెప్పాలంటే, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ లకు,నేడు దేశం లో ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం సంబంధం లేదు. మరి వీటిని పొడిగించటం, ఎన్నికలముందు కొత్త కులాలను చేర్చడం, ఉన్నవాటిని పెంచటం ఇవన్ని ప్రస్తుతం ఉన్న వ్యవస్తలను ఎలా గొప్పగా మనం వాడుకుంటూ ఉన్నామో చెప్పకనే చెప్తాయి.ఇంకొక గొప్ప ఉదాహరణ. ఆంధ్రాలో విధాన మండలి. విదాన సభలోనే వీరి ఫీట్లు చూసి జనం సిగ్గు పడుతుంటే, కేవలం రాజకీయ నిరుద్యోగులను బుజ్జగించ కోవటం కోసమే మండలిని పునరిద్దరించారంటే అతిశయోక్తి కాదు.మరి జనం అంతా వ్యవస్థలో మార్పు కోరుకుంటుంటే, వారిని ఒకరు ముందుండి నడిపిస్తుంటే తప్పేముంది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న సిగ్గుమాలిన వుద్యమాలకంటే అయన చేస్తున్నది తప్పా. వందలమందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను క్షమించాలని కొందరు ఉద్యమిస్తే, మాజీ ప్రధానిని చంపిన వారిని వదిలేయ్యని ఇంకో ఉద్యమం. మరి అలాటి వాటిలో వీరికి ఎటు వంటి తప్పు కనపడక పోవటం, యద్భావం తద్భవతి అన్నట్టు, మనం ఏది చూడాలి అనుకుంటే అదే కనపడుతుంది అని గీతా కారుడు చెప్పిన సత్యం.
                  ఏ ఉద్యమము అయినా ఒకరితోనే, ఒక మనిషి ఆలోచన తోనే ప్రారంభం అవుతుంది. జనం అతని విధానాలు, ఆశయాలు నచ్చి వెంట నడిస్తే అది ప్రజా ఉద్యమం అవుతుంది. నేటి రాజకీయులు మరుస్తున్న విషయం ఇంకొకటి ఉంది. నేడు ఈ అవినీతి వ్యతిరేక ఆందోళన జన ఉద్యమం. దీనికి చేష్టలుడిగిన ఏ వ్యవస్థ మద్దతు అక్కరలేదు. స్వప్రయోజనాలు కాపాడుకోవటానికి కిందా మీద పడుతున్న అతికొద్ది మంది మద్దత్తు దీనికి అక్కరలేదు.జనం మద్దత్తే  ప్రాణం.మరి దీనిని ఆపటం ఎవరి తరం.ఒక వేళ ఈ సారి కాక పొతే, వచ్చే సభలో నైనా..జనం దీనివెనుక ఉన్నంత కాలం జనాలకు ఉపయోగపడే విధంగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశా సజీవమే...

                                                          -------జై హింద్----

             



No comments:

Post a Comment